తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. విద్యావంతుడు, తెలంగాణ ఉద్యమకారుడిగా అందరికీ పరిచయం ఉన్న లీడర్. పలుమార్లు సోనియా, రాహుల్ సభల్లో వాళ్ల ప్రసంగాలను తర్జుమా చేశారు. అధిష్టానం వద్ద కూడా మంచి పేరుంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రవణ్ కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా ఉంది. అంతేకాదు, ఇటీవల ఆయనతో ఏ మాత్రం సంప్రదించకుండా పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని కాంగ్రెస్ లోకి రేవంత్ తీసుకున్నారు.
ఆమె ఖైరతాబాద్ నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం రేవంత్ రెడ్డి కూడా మద్ధతు పలుకుతున్నారని పార్టీలోని టాక్. ఆ విషయంపై గత కొన్ని రోజులుగా శ్రవణ్ మౌనంగా ఉన్నప్పటికీ భవిష్యత్ గురించి పునరాలోచనలో పడ్డారు. తొలి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా శ్రవణ్ కున్నారు. ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న ఆయన్ను టీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పంథా ఎంచుకున్న తరువాత ఇమడలేకపోయారు. పైగా ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకుండా అధిష్టానం కొంతకాలంగా పాటు దూరంగా పెట్టింది. దీంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు శ్రవణ్ మొగ్గుచూపారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ లో పనిచేసిన శ్రవణ్ ప్రస్తుతం రేవంత్ ఆధ్వర్యంలో జరుగుతోన్న పరిణామాల క్రమంలో రాజీనామా చేయడం ఆ పార్టీ కి పెద్ద షాక్.