విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు (Aditya Pharmacy MD Narasimha Murthy Raju ) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అయోధ్యనగర్లోని క్షత్రియభవన్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ గుర్తించినట్టు తెలుస్తున్నా, దాని విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
ఇటీవల నరసింహమూర్తి రాజు స్నేహితుడి హత్య కేసులో అరెస్టు అయి బెయిల్పై విడుదలయ్యారు. ఆ ఘటనతో పాటు ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అంత మాట్లాడుకుంటున్నారు. ఆదిత్య ఫార్మా కంపెనీకి పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. నరసింహమూర్తి రాజు మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.