Manchu Vishnu: నారా లోకేష్ తో హీరో మంచు విష్ణు భేటి…

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో సినీ నటుడు మంచు విష్ణు సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.

Published By: HashtagU Telugu Desk
Manchu Vishnu Meets Nara Lokesh

Manchu Vishnu Meets Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో సినీ నటుడు మంచు విష్ణు ఇటీవల సమావేశమయ్యారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. “సోదరుడు, డైనమిక్ మినిస్టర్ నారా లోకేశ్‌తో పలు అంశాలపై చర్చలు ఫలవంతంగా జరిగాయని” ఆయన పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సానుకూల ధృక్పదం కలిగిన వ్యక్తిగా ప్రశంసిస్తూ, భగవంతుడు ఆయనకు మరింత శక్తిని ప్రసాదించాలని ట్వీట్‌లో పేర్కొన్న విష్ణు, “హర హర మహాదేవ” అంటూ ట్వీట్ ముగించారు.

విష్ణు, లోకేశ్‌తో అనేక అంశాలపై చర్చించారని చెప్పినప్పటికీ, వాటి గురించి వివరణ తెలియలేదు. మంచు విష్ణు, సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నందున, వారి చర్చల ప్రధాన విషయాలు సినిమా పరిశ్రమ విస్తరణపై ఉండవచ్చని భావించబడుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, మంచు విష్ణు మంత్రి లోకేశ్‌తో సమావేశం కావడం ఆసక్తి కలిగించింది. కేవలం సినిమా పరిశ్రమ అంశాలపైనా? లేక రాజకీయ అంశాలపైనా చర్చలు జరిగాయా అన్నది తెలియాల్సి ఉంది.

మంచు కుటుంబం గతంలో వైసీపీకి దగ్గరగా ఉండింది. మోహన్‌బాబు పార్టీలో చేరకపోయినా, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలపడం, ముఖ్యంగా జగన్‌కు సానుకూలంగా స్పందించడం తెలిసిందే. మోహన్‌బాబు, మంచు విష్ణు జగన్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ప్రభుత్వం మారిన తరువాత మంచు ఫ్యామిలీ స్వరం మారింది.

ఇందులో భాగంగా, ప్రస్తుతం మంత్రి నారా లోకేశ్‌ను మంచు విష్ణు కలవడం చర్చనీయాంశంగా మారింది. 2022లో మంచు విష్ణు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో సమావేశమై, సినిమా టికెట్ల ధరపై నెలకొన్న గందరగోళం గురించి చర్చించారు. ఆ సమయంలో, జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా వ్యవహరించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ, మంచు ఫ్యామిలీతో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు అప్పటి అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు.

ప్రస్తుతం, మంత్రి లోకేశ్‌తో మంచు విష్ణు సమావేశం అయ్యినప్పుడు, వారి మధ్య సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి చర్చలు జరిగాయా లేదా మరే ఇతర అంశాలను వారు ప్రస్తావించారా అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. సర్వసాధారణంగా, సినిమా రంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే, సంబంధిత రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించడం మౌలికంగా కనిపిస్తుంది. కానీ, కేవలం మంచు విష్ణు ఒక్కరే లోకేశ్‌ను కలవడం, ఈ సమావేశం ప్రత్యేకతను కలిగిస్తోంది. ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచు విష్ణు, లోకేశ్‌తో సమావేశమయ్యిన తొలి సందర్భం కావడం కూడా ఆసక్తికరంగా మారింది.

  Last Updated: 30 Nov 2024, 03:54 PM IST