ప్రస్తుత కాలంలో చాలా మంది మగవారు బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. అయితే చాలామంది బట్టతలను కవర్ చేసుకోవడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చికిత్సను ఎంచుకుంటున్నారు. ప్రతి వంద మందిలో కేవలం పదిమంది మాత్రమే ఈ చికిత్స వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోలు ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఒక వ్యక్తి ప్రాణాలు మీదకు తెచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ క్లినిక్ లో కొంత కాలం కిందట 30 ఏళ్ల రషీద్ అనే వ్యక్తి పెళ్లి కావడం లేదని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకున్నాడు. ఇందుకోసం అనేక క్లినిక్ లను సంప్రదించగా మూడు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో అతను ఆగిపోయాడు. ఆ తర్వాత ఒక క్లినిక్ 15 వేల కే ఆఫర్ చేయడంతో అతను ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ కొంతకాలం తరువాత అవయవాల వైఫల్యంతో అతడు మరణించాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆపరేషన్ చేసిన డాక్టర్లతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. రషీద్ మరణంతో అతని కుటుంబం ఒక దిక్కుతోచని స్థితిలోకి పడిపోయింది.
అతని తల్లిదండ్రులు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్లే తమ కొడుకు మృతి చెందాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రషీద్ శరీరమంతా దద్దుర్లు రాగా వెంటనే తాము హాస్పిటల్ కి వెళ్ళామని తెలిపింది రషీద్ అమ్మ. అనంతరం శస్త్రచికిత్స చేసిన వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు రషీద్ తల్లి పేర్కొంది. అంతేకాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది తప్పు అని అందరికీ తెలియజేయడం కోసమే పోలీసులకు ఫిర్యాదు చేశాను అని ఆమె చెప్పుకొచ్చింది. కొడుకుని పోగొట్టుకుని తను పడిన బాధ మరే ఇతర తల్లి బాధపడకూడదు అని జుట్టు మార్పిడి అన్నది ఒక మోసపూరిత పద్ధతనీ ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయమని పోలీసులను కోరింది రషీద్ తల్లి.