ఏలూరు జిల్లా దెందులూరు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా బస్సు బోల్తా (Bus Overturned) పడింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దెందులూరు హైవే పెట్రోలింగ్ పోలీసులు బాధితులను అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బోల్తా పడడానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు.. విజయవాడ, అనంతపురం జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై నేపాలీ సెంటర్లో ఎదురుగా వస్తున్న గేదెలను తప్పించబోయి బైక్ అదుపు తప్పి కిందపడిపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
Also Read: Stray Dogs: స్కూటీ మీద వెళ్తున్న మహిళను వెంటాడిన వీధికుక్కలు, ముగ్గురికి తీవ్రగాయాలు
అనంతపురం జిల్లా విడపనకల్లు సమీపంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విడపనకల్లు ఆదర్శ పాఠశాలలో పరీక్ష రాసేందుకు మల్లికార్జున, వంశీ అనే విద్యార్థులు బైక్పై వెళ్తున్నారు. పాఠశాల సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది.