90 Year Man Life Imprisonment : 90 ఏళ్ళ వయసున్న ఓ వృద్ధుడికి జీవిత ఖైదు శిక్ష పడింది.
ఆ వయసులో అంత శిక్ష ఎందుకు వేశారు.. అని ఆలోచిస్తున్నారా ?
అతడి పేరు గంగా దయాళ్.. వయసు 90 ఏళ్ళు .. ఉత్తరప్రదేశ్ లోని సాదో పూర్ వాస్తవ్యుడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. 42 ఏళ్ల క్రితం అంటే 1981లో గంగా దయాళ్ వయసు 48 సంవత్సరాలు. సాదో పూర్ గ్రామంలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. దళితులు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఆ ఘటనలలో 10 మంది దళితులు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ ఘటనకు సంబంధించి ఐపీసీలోని 302 మరియు 307 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. దర్యాప్తులో 10 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసుపై బాధిత దళిత కుటుంబాలు అలుపెరుగని పోరాటం చేశాయి. అలా.. 42 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు చూస్తే.. నాడు పోలీసులు గుర్తించిన 10 మందిని నిందితుల్లో 9 మంది చనిపోయారు. ఒక్కడు మాత్రమే ప్రస్తుతం బతికి ఉన్నాడు. అతడే గంగా దయాళ్.
Also read : Sanjay Dutt: జైలుకు వెళ్లే ముందు కమిట్మెంట్ పూర్తి చేసిన సంజూ
లేటుగా న్యాయం జరిగిందని..
1981 నాటి 10 మంది దళితుల హత్య కేసులో ఫిరోజాబాద్ జిల్లా కోర్టు గురువారం 90 ఏళ్ల వృద్ధుడు గంగా దయాళ్ ను(90 Year Man Life Imprisonment) దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 55,000 జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో 13 నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. బాధితుల్లో ఒకరైన మహరాజ్ సింగ్ బంధువు మాట్లాడుతూ.. “1981లో ఈ సంఘటన జరిగినప్పుడు నేను పుట్టలేదు. అయితే మా కుటుంబ సభ్యులలో నలుగురు చనిపోయారని.. పొరుగున ఉన్న మరో 6 మందిని కూడా చంపారని పెద్దలు చెప్పారు. 42 ఏళ్ల తర్వాత బతికి ఉన్న ఏకైక నిందితుడికి శిక్ష పడింది. నా కుటుంబంలోని పెద్దలు జీవించి ఉన్నప్పుడే మరో 9 మంది నిందితులకు కూడా శిక్ష పడి ఉంటే బాగుండేది” అని ఆవేదన వ్యక్తం చేశారు.