గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎనిమిది మంది నిందితులు చింతా శివరామయ్య, ఎలమండ కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింతా శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింతా ఆదినారాయణలను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చింతా శివరామయ్య ఉన్నారు. నిన్న గుండ్లపాడు సెంటర్ లో బైక్ పై వెళ్తున్న చంద్రయ్యపై గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. చంద్రయ్యను హత్య చేసి దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ హత్యేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై పోరాడుతున్న వారిని హత్యా రాజకీయాలతో మభ్యపెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రయ్య అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడంతో పాటు రూ. 25 లక్షల పరిహారం కూడా అందజేశారు.
Crime: తోట చంద్రయ్య హత్య కేసులో 8మంది అరెస్ట్

Chandraiah