Site icon HashtagU Telugu

Three Buses Crash: నైజీరియాలో ఘోర ప్రమాదం.. 37 మంది దుర్మరణం.!

Mexico Bus Crash

Road accident

నైజీరియా దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈశాన్య మైదుగురి నగరం వెలుపల జకాన గ్రామ సమీపంలో మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 37 మంది మరణించారు. నైజీరియాలోని ఈశాన్య నగరం మైదుగురి వెలుపల మూడు బస్సులు ఢీకొనడంతో 37 మంది మరణించారు. ఆ దేశ రోడ్డు భద్రతా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు వాణిజ్య బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని బోర్నో రాష్ట్ర రోడ్డు భద్రత ఏజెన్సీ అధిపతి ఉటానే బోయి తెలిపారు. ఇంతలో మూడో బస్సు వీరిని ఢీకొట్టింది.

“ఇప్పటి వరకు 37 మంది మరణించినట్లు ధృవీకరించారు. వారు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. పూర్తిగా కాలిపోయారు” అని బోయి చెప్పారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 35 కిలోమీటర్లు (20 మైళ్ళు) దూరంలో జకానా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ బస్సు టైరు పగిలి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ సెక్టార్ కమాండర్ విలేకరులకు తెలిపారు. బస్సుల్లో ఒకటి అదుపు తప్పి మరోదానిని ఢీకొట్టింది. అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం మృతదేహాలను సామూహికంగా ఖననం చేయనున్నారు.

ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో రోడ్లపై ప్రమాదాలు సర్వసాధారణం. ప్రమాదాలు ఎక్కువగా వేగంగా నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున నైజీరియా రాజధాని అబుజా సమీపంలో బస్సు ట్రక్కును ఢీకొనడంతో 17 మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు.