కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లలో ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వాలు, విద్యా సంస్థల యాజమాన్యాలు కఠినంగా వ్యవహరిస్తున్నా అక్కడక్కడ ర్యాగింగ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ లో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు జూనియర్లను వేధించారు. ఆ ఘటన ఆలస్యంగా బయటపడింది. జార్ఖండ్ లోని దుమ్కాలోని గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో 40 మందిపై దాడి చేసినందుకు 27 మంది విద్యార్థులపై కేసు నమోదైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. సీనియర్ విద్యార్థులు అర్ధరాత్రి 1 గంటలకు తమ జూనియర్లను విడివిడిగా నలుగురు బృందాలుగా పిలిచి, అర్ధరాత్రి బట్టలు విప్పించి, ర్యాగింగ్ చేశారు. అయితే హాస్టల్ లో ఏర్పాటుచేసిన పార్టీలో జూనియర్లు, సీనియర్లకు విబేధాలు రావడంతో ర్యాగింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. జూనియర్లను లక్ష్యంగా చేసుకున్నారని సీనియర్లు రెచ్చిపోయినట్టు పోలీసులు తెలిపారు. ‘‘మేం 27 మంది నిందితులతో ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. దర్యాప్తు ప్రారంభించాము. విచారణ కొనసాగుతున్నందున ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు’ అని దుమ్కా ఎస్పీ అంబర్ లక్రా తెలిపారు. ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతుండగా, ఇటీవల అర్ధరాత్రి అకస్మాత్తుగా సీనియర్లు జూనియర్ల గదులకు బలవంతంగా వెళ్లారు. లైట్లు ఆఫ్ చేసి దాడి చేశారని జూనియర్స్ తెలిపారు.