గత 48 గంటల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కనీసం 13 మంది చనిపోయారు. వరద నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. అకోలాలోని పరస్గావ్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఏడుగురు మరణించారు. అక్కడ బాబూజీ మహారాజ్ సంస్థాన్ ఆశ్రమంలో పిడుగుపాటుకు 150 ఏళ్ల నాటి వేప చెట్టు టిన్ షెడ్డుపై పడింది.
ప్రార్థన వేడుకల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ప్రమాదం కారణంగా నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఔరంగాబాద్, బీడ్, హింగోలి, నందుర్బార్, పర్భాని మరియు పూణేలలో పిడుగుపాటుకు ఒక్కొక్కరు మరణించారు. వీరిలో ప్రధానంగా పొలాల్లో పనిచేసే రైతులు ఉన్నారు.
ఇదిలా ఉండగా, ఆదివారం నాసిక్లో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో ఒకరు మునిగిపోయారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, గత కొన్ని వారాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా పిడుగుపాటుకు వందలాది జంతువులు కూడా మృతి చెందాయి. పలు జిల్లాల్లో వడగళ్ల వాన వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ నష్టం వాటిల్లింది. మామిడి, ఇతర పండ్లు, కూరగాయసాగు దెబ్బతిన్నాయి.
Also Read: KCR Strategy: కేసీఆర్ సంచలనం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం!