న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో విషాదం నెలకొంది. శుక్రవారం అమర్నాథ్ గుహ ప్రాంతంలోఒక్కసారిగా వరద వచ్చింది. దీంతో అక్కడ ఉన్న గుడారాలు అన్ని కొట్టుకుపోయాయి. వరదల్లో ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు సమాచారం. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ వర్షాల తర్వాత బాల్టాల్ బేస్ క్యాంప్లో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో వరద సంభవించిందని తెలిపారు. కాశ్మీర్ పోలీసులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. రెస్క్యూ టీమ్లు ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికి తీశాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుహ పైభాగం నుంచి నీరు ప్రవహించడంతో ఫోన్ లైన్లు డిస్కనెక్ట్ అయ్యాయని, యాత్ర మార్గం దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో తరలిస్తున్నామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ప్రస్తుతానికి వర్షం ఆగిపోయిందని, అయితే యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐటీబీపీ తెలిపింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఐటీబీపీ పీఆర్వో వివేక్ పాండే మాట్లాడుతూ.. కొన్ని మార్గాలు కొట్టుకుపోయాయని, తాత్కాలిక వ్యవస్థను రూపొందించామని చెప్పారు.
నీటి ప్రవాహానికి బండరాళ్లు నేలకూలాయని, శిధిలాలు శిథిలాలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి కొన్ని మృతదేహాలను వెలికి తీశామని, మరికొన్ని మృతదేహాలను శిథిలాల కింద ఉండవచ్చని తెలిపారు. శిథిలాలను తొలగించి యాత్ర మార్గాన్ని పునరుద్ధరించడానికి ఒక రోజంతా పడుతుందని అధికారులు తెలిపారు. విద్యుదాఘాతానికి సంబంధించిన ప్రమాదాలను నివారించడానికి విద్యుత్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఘటనపై స్పందించారు. బాధిత యాత్రికులకు అన్ని విధాలా సాయం అందిస్తున్నామని ట్వీట్ చేశారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని.. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు.