అసోం రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టగొడుగులు తిన్న 13మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరణించిన వారంత కూడా తేయాకు కార్మికులుగా అధికారులు గుర్తించారు. అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
చరైడియో, దిబ్రూఘర్, శివసాగర్, టిన్సుకియా ప్రాంతాల నుంచి గత ఐదు రోజుల్లో మొత్తం 35మంది ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో రెండు రోజుల్లో మొత్తం 13మంది మరణించినట్లు అస్సాం మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 9 మంది మరణించారు. బాధితులంతా కూడా అడవిలో దొరికే పుట్టగొడుగులను తిన్నట్లుగా భావిస్తున్నారు. పుట్టగొడుగులు తిన్న తర్వాత వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.