ఈ స్కామ్ ప్రఖ్యాత కేదార్నాథ్ మందిర్ లో జరిగిందని చార్ధామ్ మహా పంచాయత్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ త్రివేది ఆరోపించారు.
ఆలయంలోని గర్భగుడి గోడలకు పూసిన బంగారం పూత ఇత్తడిగా మారిందని ఆరోపిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు.
కేదార్నాథ్ గర్భగుడి గోడలకు 2022 సంవత్సరంలో బంగారు పూత పూశారు. భక్తుల నుంచి విరాళంగా వచ్చిన డబ్బుతోనే ఈ వర్క్స్ జరిగాయి. అయితే కొద్ది రోజుల క్రితం చార్ధామ్ మహాపంచాయత్ వైస్ ప్రెసిడెంట్, కేదార్నాథ్ సీనియర్ తీర్థయాత్ర పూజారి ఆచార్య సంతోష్ త్రివేది ఒక వీడియో రిలీజ్ చేయడం వివాదానికి దారితీసింది. ఆలయంలోని గర్భగుడి గోడలకు పూసిన బంగారు పూత ఇత్తడిగా మారిపోయిందని ఆయన ఆ వీడియోలో ఆరోపించారు. బంగారు తాపడం పేరుతో రూ. 125 కోట్ల కుంభకోణం(125 Crore Gold Scam) జరిగిందని కామెంట్ చేశారు.
ఈ ఆరోపణపై బద్రీ-కేదార్ ఆలయ కమిటీ (BKTC) వివరణ ఇచ్చింది. సంతోష్ త్రివేది చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. “కేదార్నాథ్ గర్భగుడిలో బంగారు తాపడం చేయించాలని కోరుతూ ఒక దాత బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చాడు. ఆయన కోరిక మేరకు బంగారు తాపడం చేయించాం.. పురావస్తు శాఖ పర్యవేక్షణలో బంగారు తాపడం వర్క్స్ జరిగాయి” అని ఆలయ కమిటీ తెలిపింది. గత సంవత్సరం బంగారు తాపడం వర్క్స్ కు బద్రీ-కేదార్ ఆలయ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత కొందరు పూజారులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బంగారం అనేది సంపదకు చిహ్నం కాబట్టి .. దానితో గర్భగుడిలో తాపడం చేయడం కేదార్నాథ్ విశ్వాసానికి విరుద్ధమని పూజారులు అప్పట్లో వ్యాఖ్యానించారు. అయినా ఇవేం పట్టించుకోకుండా ఆలయ కమిటీ కేదార్నాథ్ గర్భగుడిలో బంగారు తాపడం వర్క్స్ చేయించింది.
Also read : Gold: మన దేశంలో బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తుందో తెలుసా?
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ స్పందిస్తూ.. “అఖిలేష్ కూడా విచారణ గురించి మాట్లాడుతున్నారంటే అది రాజకీయ కుట్రలా కనిపిస్తోంది. కేదార్నాథ్కు వచ్చే భక్తుల సంఖ్య ఈసారి రికార్డు స్థాయిలో పెరిగింది. ఇది కొంతమంది రాజకీయ వ్యక్తులకు నచ్చడం లేదు” అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.