Mangos in EMI : ఖరీదైన వస్తువులను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేస్తుంటాం. కానీ, ఇప్పుడు మామిడి పండ్ల (Mangos) ను కూడా ఈఎంఐ (EMI) లో కొనొచ్చు తెలుసా మీకు .. ఆశ్చర్యపోతున్నారా..! మామిడి పండ్ల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారి ఇలా వినూత్నంగా అమ్మకాలు చేపట్టాడు!
అన్ని పండ్లలోమామిడి పండంటే ఎవరికి ఇష్టం ఉండదు. వేసవి సీజన్ ప్రారంభం వీటి ధరలు విపరీతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా సింధ్దుర్గ్ జిల్లాలోని దేవగఢ్, రత్నగిరి జిల్లాల్లో దొరికే ఆల్ఫోన్సో (Alphonso) రకం మామిడి పండ్లు భారీగా ధర పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్లో వీటి ధర డజన్కు రూ.800 నుంచి రూ.1300 వరకు ఉంటుంది. దీంతో పుణెకు చెందిన గౌరవ్ సనాస్ ఓ కొత్త ఆలోచన చేశారు.
తమ దుకాణాల్లో మామిడి పండ్ల (EMI On Mangeos) ను ఈఎంఐలో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. వాయిదా పద్ధతిలో రుచికరమైన మామిడి పండ్లను కొనుక్కోవచ్చని తెలిపారు. అయితే దీనికి కొన్ని షరతులు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందట. అంతేకాదు.. కనీసం రూ.5000 అంతకంటే ఎక్కువ విలువ చేసే పండ్లు కొనుగోలు చేస్తేనే.. ఈఎంఐ సదుపాయం ఉంటుందని గౌరవ్ పేర్కొన్నారు. ఇందుకోసం ఆయన పేటీఎం స్వైప్ మిషన్ను వినియోగిస్తున్నారు. కస్టమర్ మామిడి పండ్లను కొనుగోలు చేసిన తర్వాత క్రెడిట్ కార్డుతో ఈ మిషన్లో స్వైప్ చేసి బిల్లు తీసుకుంటున్నారు. అప్పుడు మిషన్లో కన్పించే ఈఎంఐ ఆప్షన్ను ఎంచుకుంటే బిల్లును మూడు, ఆరు, 12 నెలవారీ వాయిదాల్లో చెల్లించొచ్చని ఆయన తెలిపారు.
‘‘ఈ పండ్లను తినాలని చాలా మందికి ఉన్నా.. ధర కారణంగా చాలా మంది కొనుగోలుకు ఆసక్తి చూపించట్లేదు. అందుకే అందరికీ ధరలు అందుబాటులో ఉండాలని ఈఎంఐ ఆఫర్ తీసుకొచ్చాం’’ అని గౌరవ్ ఈ సందర్భంగా తెలిపారు. గురుకృప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ పేరుతో ఆయన స్థానికంగా రిటైల్ పండ్ల వ్యాపారం చేస్తున్నారు.
Also Read: Dhoni Silence: ధోని నిశ్శబ్దం ఎందుకంటే.. ధావన్ కామెంట్స్..