Rahul Gandhi : గత ఎన్నికలలాగే ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు లోక్సభ స్థానాల నుంచి బరిలోకి దిగారు. కేరళలోని వయనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో యూపీలోని అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్.. ఈ సారి వ్యూహాన్ని మార్చుకొని తన తల్లి సోనియాగాంధీ సిట్టింగ్ లోక్సభ స్థానం రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగారు. దీంతో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని భావించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇంతకీ ఈ అనూహ్య నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంది ? దీని వెనుక హస్తం పార్టీ రాజకీయ వ్యూహం ఏమిటి ?
We’re now on WhatsApp. Click to Join
యూపీలోని రాయ్బరేలీ లోక్సభ స్థానంలో ఇప్పటివరకు 20సార్లు పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ 17సార్లు విజయం సాధించింది. ప్రత్యేకించి 2019 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీకి రాయ్బరేలీలో దాదాపు 56 శాతం ఓట్లు పడ్డాయి. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. రాయ్బరేలీ లోక్సభ నియోజవర్గం పరిధిలోని 5 స్థానాలకుగానూ కాంగ్రెస్ – సమాజ్వాదీ పార్టీ కూటమి నాలుగు గెల్చుకుంది. ఇక అమేథీలోని 5 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ 3, సమాజ్వాదీ పార్టీ 2 దక్కించుకున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా.. అమేథీ కన్నా రాయ్బరేలీయే కాంగ్రెస్కు బలమైన కోటలా ఉంది. రాహుల్ అమేథీ నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోతే కాంగ్రెస్లో ఆయన చరిష్మా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే ఈసారి రాహుల్ గాంధీ భావోద్వేగ నిర్ణయం తీసుకోలేదు. ఎంతో సురక్షితంగా ఉండే రాయ్బరేలీ సీటును పోటీకి ఎంచుకున్నారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ నుంచి రాహుల్ గాంధీకి పెద్దగా పోటీ ఉండదని ఇటీవల జరిగిన సర్వేలలో స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో ఒకవేళ రాయ్బరేలీ, వయనాడ్ రెండు స్థానాల్లోనూ గెలిస్తే.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కచ్చితంగా రాయ్బరేలీలోనే కొనసాగుతారని అంటున్నారు. ఆయన వయనాడ్ను వదులుకునేందుకు మొగ్గుచూపే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీలో ఎంపీగా కొనసాగేందుకే రాహుల్కు ఆసక్తి ఉందని తెలుస్తోంది.
అమేథీ నుంచి కాంగ్రెస్ లోక్సభ టికెట్ దక్కించుకున్న కిశోరీ లాల్ శర్మ.. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించే అవకాశాలు తక్కువేనని అంచనా వేస్తున్నారు. రాహుల్గాంధీ 2004 నుంచి వరుసగా 3 సార్లు అమేథీ నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2014లో అమేథీలో రాహుల్ ఓటు షేర్ 46 శాతం ఉండగా, 2019లో అది కాస్తా 43 శాతానికి తగ్గింది. అమేథీలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 18సార్లు పోటీ చేస్తే 15 సార్లు గెలిచింది.