IT Job Cuts : ఐటీ రంగంలో జాబ్ కట్స్ ట్రెండ్ కొనసాగుతోంది. మూడు అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ లు గత ఆరు నెలల్లో వేలాది మందిని జాబ్స్ నుంచి తొలగించాయి. వాటి జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విశ్లేషణలో ఈ ఆందోళనకర వివరాలు వెల్లడయ్యాయి. గత ఆరు నెలల్లో ఈ మూడు ఐటీ కంపెనీలలో దాదాపు 25వేల మందిని జాబ్స్ నుంచి తప్పించారని అంటున్నారు. ఈ వ్యవధిలో ఒక్క ఇన్ఫోసిస్లోనే 14వేల మందిని తొలగించారని తెలుస్తోంది. ఇంకో 4 నెలల పాటు క్యాంపస్ హైరింగ్ చేయబోమని ఇన్ఫోసిస్ తేల్చి చెప్పింది. హెచ్సీఎల్ టెక్లోనూ ఇదే పరిస్థితి ఉందని సమాచారం. ఈ కంపెనీ కూడా 2,299 మందిని జాబ్స్ నుంచి తీసేసిందని తెలుస్తోంది. టీసీఎస్ గత మూడు నెలల్లో దాదాపు 6000 మందిని తొలగించింది. రానున్న నెలల్లో కూడా ఇదే తరహాలో ఉద్యోగుల సంఖ్య తగ్గించే అవకాశం ఉందని ఆ కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆయా ఐటీ కంపెనీలు ఇప్పటికే నియమించుకున్న ఉద్యోగులను, వారి నైపుణ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే లక్ష్యంతోనే జాబ్స్ తీసేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. సంస్థల నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే దిశగా చేపడుతున్న చర్యల్లో భాగమే ఈ ఉద్యోగ కోతలని అంటున్నారు. ఇంతేకాకుండా తమ దగ్గర రాజీనామా చేసి వేరే కంపెనీలకు వెళ్లిపోయే సిబ్బంది స్థానంలో కొత్తవారిని చాలా ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకోవడం లేదు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు తమకు అవసరమున్నప్పుడల్లా బెంచ్ పై ఉన్న ఫ్రెషర్లను తీసుకుని, అవసరమైన నైపుణ్యాల్లో వారికి శిక్షణ ఇచ్చి వాడుకుంటున్నాయి. దాదాపు వచ్చే నాలుగు నెలల పాటు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని ఐటీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్లు పొందిన ఎంతోమందికి నేటికీ అపాయింట్మెంట్ లెటర్ల అందలేదని (IT Job Cuts) గుర్తు చేస్తున్నాయి.