Teachers Day : మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అంటారు.
అద్భుతాలు సృష్టించే శాస్త్రవేత్తలు.. అందరికీ ప్రాణం పోసే వైద్యులు.. న్యాయం అందించే లాయర్లను తయారు చేసే మహామహులు ఉపాధ్యాయులు.
అందుకే గురువు పూజనీయుడు.
ఉపాధ్యాయులు లేకుండా ఏ విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకోలేడు.
విద్యార్థిలోని మొదటి శక్తిని గుర్తించి సానబెట్టేది టీచరే.
ఇవాళ ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే రోజున ఏటా మనదేశంలో టీచర్స్ డేను నిర్వహించుకుంటున్నాం.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన దంపతులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు. ఈయన తెలుగు వ్యక్తే. బతుకుదెరువు కోసం రాధాకృష్ణన్ పేరెంట్స్ తమిళనాడులోని తిరుత్తణికి వలస వెళ్లిపోయారు. 1888 సెప్టెంబర్ 5న తిరుత్తణిలోనే రాధాకృష్ణన్ పుట్టారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణయ్య పేరు.. తమిళనాడులో రాధాకృష్ణన్ గా మారిపోయింది. చిన్న వయసు నుంచే చదువుల్లో రాణించిన సర్వేపల్లి.. 20 ఏళ్ల వయసులోనే బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ పూర్తిచేశారు. వేదాంత వ్యవస్థలో నైతికతకు చోటు లేదని చెప్పే అంశంపై ఆయన ఈ థీసిస్ రాశారు. రాధాకృష్ణన్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో, మైసూరు విశ్వవిద్యాలయంలో, కలకత్తా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ గా సేవలందించారు. వైజాగ్ లో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్లర్గా కూడా పనిచేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులోనూ ఆయన పాల్గొన్నారు.
తాను టీచింగ్ చేసిన ప్రతిచోటా ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి వారిని చదువు వైపు నడిపించారు. అందుకే ఆయన గొప్ప టీచర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రష్యాకు భారత రాయబారిగా వెళ్లారు. భారతరత్న పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. మన దేశ రెండోరాష్ట్రపతిగా సేవలందించారు. ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగి ఉండటం వల్లే సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఏటా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Teachers Day) నిర్వహించుకుంటున్నారు. 1962 నుంచి మనదేశంలో ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.