టీమిండియా ఫాస్ట్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఒకరు. అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చినా కొద్దిరోజుల్లోనే పదునైన బౌలింగ్ వేస్తూ, వికట్లు పడగొడుతూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1994లో జన్మించిన సిరాజ్ మద్య తరగతి కుటుంబం నుంచి వచ్చినడవాడు. అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడు. అతని తండ్రి కుటుంబ అవసరాల కోసం ఆటో రిక్షా డ్రైవర్గా పనిచేశాడు. సీన్ కట్ చేస్తే సిరాజ్ నేడు ప్రపంచంలోనే వరల్డ్ నెంబర్ 3 బౌలర్గా నిలిచాడు.
అనేక కష్టాలు ఎదుర్కొని క్రికెట్ అత్యున్నస్థాయికి ఎదిగిన తీరు ఎంతోమంది ఆదర్శం. సిరాజ్ ప్రతిష్టాత్మకమైన భారత క్రికెట్ జట్టులో తన స్థానాన్ని పొందేందుకు అనేక అడ్డంకులను అధిగమించాడనే విషయం చాలామందికి తెలియదు. సిరాజ్ తన అంతర్జాతీయ కెరీర్ను 2017లో ప్రారంభించాడు. 2017 IPL కోసం 2.6 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కొనుగోలు చేసిన తర్వాత అతని జీవితంలో మలుపు తిరిగింది. ఐపీఎల్ సమయంలో అందరినీ ఆకట్టుకున్న అతను ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సిరాజ్ కష్టపడి పనిచేసే వ్యక్తి మాత్రమే కాదు, వినయపూర్వకమైన వ్యక్తి కూడా.
ఒకప్పుడు పాతబస్తీలో ఇరుకైన ఇంట్లో ఉన్న సిరాజ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి సొంతింటి కలను సాధ్యం చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాళ్లను తన ఇంటికి ఆహ్వానించి హైదరాబాద్ రుచులను పరిచయం చేశారు. IPL మ్యాచ్కు ముందు సెలబ్రిటీ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇతర సహచరులతో కలిసి సిరాజ్ ఇంటిని సందర్శించారు. సిరాజ్ ఇంట్లో టీమ్ సందడి చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పట్టుదల, కష్టపడాలనే తపన ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చు అనడానికి సిరాజ్ ఓ ఉదాహరణ.