National Engineers Day : మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. మనదేశం గర్వించే గొప్ప ఇంజనీర్. ఇవాళ (సెప్టెంబర్ 15) ఆయన జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్స్ దినోత్సవం జరుపుకుంటారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దనేహళ్లి గ్రామంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు. సామాన్య కుటుంబానికి చెందిన విశ్వేశ్వరయ్య.. అసామాన్య ఇంజనీరింగ్ ప్రతిభా పాఠవాలతో యావత్ దేశం మన్ననలు అందుకునే స్థాయికి ఎదిగారు. ఆయన బాంబేలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా కెరీర్ ను ప్రారంభించారు.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. రాజకీయ నాయకుడిగా, మైసూర్ 19వ దివాన్గా కూడా విశ్వేశ్వరయ్య పనిచేశారు. ఆయన మైసూర్ దివాన్గా ఉన్నప్పుడు మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ ను స్థాపించారు. మైసూర్లోని కృష్ణ రాజ సాగర్ డ్యామ్ అభివృద్ధి, దక్కన్ పీఠభూమిలో నీటిపారుదల వ్యవస్థ, హైదరాబాద్కు వరద రక్షణ వ్యవస్థ వంటి పనులకు ఇంజనీరింగ్ ప్లానింగ్ అందించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్యే. 1946లో తిరుమల మొదటి ఘాట్ మార్గానికి రూట్మ్యాప్ ను ఆయన రూపొందించారు. విశ్వేశ్వరయ్య బ్రిటీష్ ఇండియన్ ఎంపైర్ యొక్క నైట్ కమాండర్ అవార్డును, భారతరత్న అవార్డును అందుకున్నారు. 1962 ఏప్రిల్ 12న మోక్షగుండం (National Engineers Day) దివంగతులయ్యారు.