National Science Day : రూ.200 విలువచేసే పరికరాలతో ‘నోబెల్’.. హ్యాట్సాఫ్ సీవీ రామన్

National Science Day : సర్ సీవీ రామన్.. భారతజాతి ముద్దుబిడ్డ. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులు కూడా నోబెల్ ప్రైజ్ సాధించగలరని నిరూపించిన ఘనుడు ఆయన.

  • Written By:
  • Updated On - February 28, 2024 / 09:15 AM IST

National Science Day : సర్ సీవీ రామన్.. భారతజాతి ముద్దుబిడ్డ. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులు కూడా నోబెల్ ప్రైజ్ సాధించగలరని నిరూపించిన ఘనుడు ఆయన. విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ సాధించిన మొట్టమొదటి ఆసియా వాసి కూడా మన సీవీ రామనే. ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు ఆయన. సీవీ రామన్‌గా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్.. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. 1987 నుంచి ఫిబ్రవరి 28న ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది. ఒక్కో ఏడాది కీలకమైన థీమ్‌ను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ‘ప్రపంచ సంక్షేమం కోసం ప్రపంచ సైన్స్’ (National Science Day)  అనే థీమ్‌ను తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

రామన్ జీవిత విశేషాలు.. 

  • 1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించారు.
  • విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్ చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి కూడా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నారు.
  • తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించారు.
  • మద్రాస్ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో యూజీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఆ సబ్జెక్టులోనూ గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
  • పద్దెనిమిదేళ్ల వయసులో కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ రాసిన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి.
  • పరిశోధనల పట్ల అయనకున్న అభిరుచిని గమనించిన అధ్యాపకులు ఇంగ్లాండు వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఇంగ్లాండు వాతావరణానికి ఆయన ఆరోగ్యం సరిపడదని తేల్చడంతో ప్రయాణాన్ని విరమించుకున్నారు.
  • ఆ తర్వాత ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగిగా చేరిన సీవీ రామన్ 1907లో బాధ్యతల రీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్‌కు రోజూ వెళ్లి పరిశోధనలు చేసేవారు.
  • రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ.. నాటి బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రామన్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని ఆ లేఖలో సూచించారు. అయితే బ్రిటీష్ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన రామన్ పరిశోధనలపై పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించారు.
  • ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఒకసారి కలకత్తాలో వీధుల్లో తిరుగుతుండగా బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూశారు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందారు.
  • అత్యంత ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్‌‌ను 1924లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యత్వం.. 1928లో సర్ బిరుదు దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ 1947లో లభించింది.

Also Read : Point Nemo : భూమిపైనే అంత‌రిక్ష శ్మశానవాటిక.. అడ్రస్ ఇదీ

రామన్ ఎఫెక్ట్‌కు బాటలు పడ్డాయి ఇలా.. 

ఒకసారి  ఇంగ్లాండుకు వెళ్లి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు.. ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఏంతో ఆసక్తితో గమనించాడు. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని.. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు. కలకత్తా చేరుకోగానే తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స్ కిరణాలు పరిశోధన నిజమైనపుడు, కాంతి విషయంలోనూ అది నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు.ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్‌కు దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు.

రూ.200 కూడా విలువలేని పరికరాలతో..

పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెల్లడించారు. నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1929లో  నైట్ హుడ్ బిరుదుతో రామన్ ను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. సైన్స్‌కు రామన్ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికి పాటుపడ్డ సీవీ రామన్ 1970 నవంబర్ 21న కన్నుమాశారు.

Also Read :CAA Rules : మార్చి నుంచే సీఏఏ అమల్లోకి.. ఎన్నికల కోడ్‌కు ముందే ప్రకటన