National Science Day : సర్ సీవీ రామన్.. భారతజాతి ముద్దుబిడ్డ. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులు కూడా నోబెల్ ప్రైజ్ సాధించగలరని నిరూపించిన ఘనుడు ఆయన. విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ సాధించిన మొట్టమొదటి ఆసియా వాసి కూడా మన సీవీ రామనే. ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు ఆయన. సీవీ రామన్గా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్.. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. 1987 నుంచి ఫిబ్రవరి 28న ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది. ఒక్కో ఏడాది కీలకమైన థీమ్ను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ‘ప్రపంచ సంక్షేమం కోసం ప్రపంచ సైన్స్’ (National Science Day) అనే థీమ్ను తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఒకసారి ఇంగ్లాండుకు వెళ్లి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు.. ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఏంతో ఆసక్తితో గమనించాడు. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని.. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు. కలకత్తా చేరుకోగానే తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స్ కిరణాలు పరిశోధన నిజమైనపుడు, కాంతి విషయంలోనూ అది నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు.ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్కు దారితీసింది. అధునాతనమైన పరికరాలు లేకపోయినా తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్న రామన్ అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు.
పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెల్లడించారు. నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్ హుడ్ బిరుదుతో రామన్ ను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. సైన్స్కు రామన్ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికి పాటుపడ్డ సీవీ రామన్ 1970 నవంబర్ 21న కన్నుమాశారు.