Panda Envoys : ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భేటీ అయ్యారు. దీన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా చూసింది. వారి ప్రసంగాలను అందరూ ఇంట్రెస్టింగ్గా విన్నారు. ఎందుకంటే ప్రపంచంలోని పవర్ ఫుల్ దేశాల జాబితాలో అమెరికా, రష్యా తర్వాత వచ్చే నంబర్ 3 కచ్చితంగా చైనాదే. ఇంతగా ప్రపంచంలో ఉనికిని పెంచుకున్న చైనా ఏం చేసినా సంచలనమే. తాజాగా బైడెన్తో భేటీ తర్వాత.. అమెరికాకు కొత్తగా కొన్ని పాండాలను పంపిస్తామని చైనా ప్రెసిడెంట్ షి జిన్పింగ్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య స్నేహానికి వారధులుగా, దూతలుగా ఈ పాండాలు నిలుస్తాయని ఆయన ఆకాంక్షించారు. పాండాలను ప్రస్తావిస్తూ జిన్ పింగ్ ఇంతపెద్ద ఎందుకు అన్నారు .. అనుకుంటున్నారా ? మరేం లేదు.. పాండాలు.. చైనా జాతీయ జంతువులు. అందుకే వాటికి చైనా అంతగా ప్రాధాన్యం ఇస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
చైనా, అమెరికాల మధ్య స్నేహానికి పాండాలతో ఉన్న అనుబంధానికి చాలా దశాబ్దాల చరిత్ర ఉంది. చివరిసారిగా అమెరికాకు చైనా పాండాలను ఇచ్చిందో తెలుసా ? 1972 సంవత్సరంలో !! ఆ ఏడాదిలో ఇరుదేశాల స్నేహ సంబంధాల పునరుద్ధరణ చర్యల్లో భాగంగా వాషింగ్టన్లోని నేషనల్ జూకు చైనా ఒక జత పాండాలను బహుమతిగా పంపింది. వాటి పేర్లు మెయి జియాంగ్, టియాన్ టియాన్. ఆ పాండాల జంటను 50 ఏళ్లపాటు అమెరికాలో ఉంచుకునేందుకు చైనా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అనంతర కాలంలో అమెరికాలోని శాన్ డియాగో, మెంఫిస్, టెన్నెస్సీ, అట్లాంటా జూలకు కూడా చైనా తమ పాండాలను పంపి ఇదేవిధమైన అగ్రిమెంట్లు కుదుర్చుకుంది.
1972లో కుదిరిన అగ్రిమెంట్ 2022 సంవత్సరంలో ముగిసింది. దీంతో చైనా తొలిసారిగా అమెరికాకు పంపించిన పాండాల జంట మెయి జియాంగ్, టియాన్ టియాన్లతో పాటు వాటి పిల్ల పాండాను ఇటీవలే వాషింగ్టన్లోని నేషనల్ జూ నుంచి బీజింగ్కు పంపించేశారు. మెంఫిస్, టెన్నెస్సీ జూలలోని పాండాలను ఈ ఏడాది ప్రారంభంలోనే చైనాకు పంపారు. శాన్ డియాగో జూ నుంచి పాండాలను 2019లోనే చైనాకు పంపేశారు. ఇక అమెరికాలోని అట్లాంటా జూలో మరో నాలుగు చైనా పాండాలు మిగిలి ఉన్నాయి. వాటి లీజు గడువు ఇంకా ముగియలేదు. ఈనేపథ్యంలో మరిన్ని పాండాలను అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ డియాగో నగరాలలోని జూలకు పంపిస్తామని చైనా అనౌన్స్ చేసింది. త్వరలోనే అవి అక్కడికి చేరే ఛాన్స్(Panda Envoys) ఉంది.