బంజరు భూమిని ఆర్గానిక్ ట్రీ ఫామ్గా మార్చిన కర్ణాటకకు చెందిన ఓ రైతు ప్రతిష్టాత్మక పద్మ అవార్డును అందుకోనున్నారు. అమై మహాలింగ నాయక్ భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకోనున్నారు. పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రభుత్వం జనవరి 25న ప్రకటించింది. 70 ఏళ్ల నాయక్, కర్ణాటకలోని కేపు గ్రామంలో బంజరు భూమికి నీరందించే ప్రయత్నంలో అవిశ్రాంతంగా సొరంగాలు తవ్వినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ అద్భుతమైన కథనం ప్రచురించింది.
గ్రావిటీ ద్వారా నీటిని తరలించడానికి ఐదు సొరంగాలను చేతి పనిముట్లతో తవ్వారు. బోరుబావులను తవ్వించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సంప్రదాయపద్ధతుల్లో తన పంటలకు నీరు పారేలా చేశారు. ఎత్తయిన ప్రదేశంలో ఉండే తన పంట పొలాలకు సమాంతరంగా ఈ సొరంగాలను తవ్వి.. పైపుల ద్వారా నీరు సరఫరా అయ్యేలా చేశారు. రసాయన రహితంగా వ్యవసాయాన్ని సాగిస్తున్నారు. ఆయనను కన్నడిగులు వన్ మ్యాన్ ఆర్మీగా పిలుస్తారు.
అయితే మొదట్లో నాయక్ లక్ష్యం నెరవేరలేదు. సొరంగం తవ్వుతున్నప్పుడు ప్రజలు అతనిని ఎగతాళి చేశారు. నాయక్ కృషితో జీవం పోసుకున్న ఈ భూమిలో ఇప్పుడు రకరకాల చెట్లు, తీగలు ఉన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నాయక్ను ట్వీట్లో ప్రశంసించారు. “వాట్ ఎ లైఫ్, వాట్ ఎ అచీవ్మెంట్” అని మంత్రి ట్వీట్ చేశారు. “పద్మశ్రీ అవార్డును అందుకున్న కర్ణాటక ‘సింగిల్ మ్యాన్ ఆర్మీ’ అమై మహాలింగ నాయక్. “రాళ్లను కోయడం, నీటి వనరుల కోసం సొరంగాలు తవ్వడం లాంటివి చేసినా సంకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుందని ఆయన నిరూపించారు” అని షెకావత్ తెలిపారు. షెకావత్ నాయక్ను “నీటి యోధుడు”గా అభివర్ణించారు.
What a life, what an achievement.
Karnataka's 'single man army' Amai Mahalinga Naik, who has been conferred with the Padma Shri Award.#PadmaAwards pic.twitter.com/w3AinMaq9y
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) January 25, 2022