Living Wage 2025 : మనదేశంలో ప్రస్తుతం ‘కనీస వేతన వ్యవస్థ’ అమల్లో ఉంది. 2025 సంవత్సరం నాటికి దీన్ని ‘జీవన వేతన వ్యవస్థ’తో రీప్లేస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి మరింత మెరుగవుతుందని అంటున్నారు. జీతాలు, అదనపు భత్యాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జీవన వేతనంపై మరిన్ని వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
జీవన వేతన వ్యవస్థ అమల్లోకి వస్తే.. దేశంలోని సగటు జీవికి పలు ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు. మనిషికి కావాల్సిన కనీస అవసరాలు గృహం, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య, దుస్తులు, నివాసం వంటివన్నీ లెక్కలోకి తీసుకొని జీవన వేతనాలను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంటే శాలరీలు ఇప్పుడు ఇస్తున్న కనీస వేతనాల కంటే పెరుగుతాయి.మారుతున్న కాలం, సాంకేతికతో పాటు కనీస అవసరాల్లో వచ్చిన మార్పులను శాలరీ ఇచ్చేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు. కార్మికుడి సామాజిక అభ్యున్నతికి అవసరమైన అన్ని కీలకాంశాలపై శ్రద్ధ పెడతారు. కార్మికుడి కుటుంబానికి సామాజిక భద్రత పెరిగేలా చూస్తారు. మొత్తం మీద జీవన వేతనం అనేది కార్మికుడి ప్రాథమిక అవసరాలను తీర్చేంతగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కనీస వేతనాల వ్యవస్థను పక్కనపెట్టి, దాని స్థానంలో ‘జీవన వేతన విధానాన్ని'(Living Wage 2025) తీసుకురావాలని మోదీ సర్కారు యోచిస్తోంది.
మనదేశంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు, కార్మికల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు కొంత మారాయి. అయినప్పటికీ నేటికీ చాలా కంపెనీల్లోని ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు అందడం లేదు. మనదేశంలో 50 కోట్ల మందికిపైగా కార్మికులు ఉన్నారు. వారిలో 90% మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వారికి కనీస వేతనం రోజుకు రూ.176 లేదా అంతకంటే కాస్త ఎక్కువగా ఉంది. ఇది వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే 2017 నుంచి జాతీయ స్థాయిలో కనీస వేతనంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది ఆయా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలల్లోని కార్మికులకు కనీస వేతన స్థాయి కంటే చాలా తక్కువ మొత్తంలో జీతం ఇస్తున్నారు. 2025లో జీవన వేతన విధానం అమల్లోకి వస్తే.. చిరు జీవుల బతుకుచిత్రం మారుతుందో.. లేదో వేచిచూడాలి.