China Vs Elections : చైనా ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఇతర దేశాల ఎన్నికలను కూడా చైనా రహస్యంగా ప్రభావితం చేసేందుకు కుట్రలు చేస్తోంది. చైనా చర్యలు ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీక్రెట్గా ఎన్నికలను ప్రభావితం చేయడం ద్వారా తమ దేశానికి అనుకూలంగా ఉండే రాజకీయ వర్గాలకు ఫలితాలు కలిసొచ్చేలా చేయడమే చైనా లక్ష్యం. 2024 అనేది ‘ఎన్నికల సంవత్సరం’. ఈ ఏడాది దాదాపు 64 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లోనూ చైనా(China Vs Elections) వేలు పెడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కథనమిది.
We’re now on WhatsApp. Click to Join
- తాజాగా కెనడా సెక్యూరిటీ ఇంటెలీజెన్స్ సర్వీస్ విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలను ప్రస్తావించారు. 2019, 2021 సంవత్సరాల్లో తమ దేశంలో జరిగిన ఫెడరల్ ఎన్నికలను చైనా సీక్రెట్గా ప్రభావితం చేసిందని కెనడా సెక్యూరిటీ ఇంటెలీజెన్స్ సర్వీస్ వెల్లడించింది.
- ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ తమకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీకి దన్నుగా ఉండేలా చైనా పావులు కదుపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
- తమ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులను బలహీనులుగా చూపించేలా ప్రచారం చేయించేలా చైనా వ్యూహాలను అమలు చేస్తుంటుంది. ఇందుకోసం అన్ని రకాల మీడియాలను చైనా వాడుకుంటోంది. ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికగా ఈ తరహాలో పదునైనా ప్రచారాన్ని డ్రాగన్ నిర్వహిస్తోంది.
- చైనా ఆగడాలపై 2023 సంవత్సరంలో ఫేస్ బుక్ పేరెంట్ ఆర్గనైజేషన్ ‘మెటా’ కొరడా ఝుళిపించింది. చైనా తప్పుడు ప్రచారపు నెట్వర్క్తో సంబంధమున్న 9వేల ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలను బ్యాన్ చేసింది.
- ప్రధానంగా బ్రిటన్, అమెరికా, అస్ట్రేలియా లాంటి దేశాలే లక్ష్యంగా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లలో చైనా ప్రచారం చేస్తోందని ఆనాడు దర్యాప్తులో వెల్లడైంది.
- ఎన్నికలను ప్రభావితం చేసేందుకు మీడియా, రాజకీయ పార్టీలు, వ్యాపార వేత్తలు, ఎన్జీవోలను చైనా పరోక్షంగా ప్రభావితం చేస్తుంటుంది. వాటితో చైనా అనుకూల వైఖరిని ప్రచారం చేయిస్తుంది.
- గత ఏడాది నవంబర్లో అమెరికాలో పెద్ద కుట్ర భగ్నమైంది. చైనాకు లింక్ అయి ఉన్న 5వేల ఫేక్ సోషల్మీడియా అకౌంట్లను బ్యాన్ చేశారు. ఈ అకౌంట్లు చైనీయులవి అని.. వాళ్లు అమెరికన్లలా నటిస్తూ పోస్టులు పెట్టేవారని దర్యాప్తులో తేలింది.
- 2022లో జరిగిన ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ ఎన్నికల్లోనూ చైనా ఇలాగే గోబెల్స్ ప్రచారం చేయించిందట.
- ఏఐ టెక్నాలజీతో ఫేక్ వీడియోలు, ఫొటోలను కూడా చైనా వైరల్ చేయిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఏఐ టెక్నాలజీని చైనా దుర్వినియోగం చేసింది.