Robberies – Dussehra : దసరా పండుగ సెలవుల వేళ హైదరాబాద్ మహా నగరం నుంచి ఎంతోమంది తమతమ సొంతూళ్లకు వెళ్తుంటారు. దీంతో సిటీలోని పలు కాలనీలు నిర్మానుష్యంగా మారుతుంటాయి. దీన్ని అదునుగా తీసుకొని.. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు జరిగిన ఘటనలు గతంలో చాలా చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి వెళ్లే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీసులు సూచిస్తున్నారు.
ప్రత్యేకించి సిటీలోని శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, బాలానగర్, మల్కాజ్గిరి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ల పరిధిలోని ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని పోలీసులు కోరారు. ఈ ఏడాది సమ్మర్ టైంలో హైదరాబాద్ లో థార్, చెడ్డీ, పార్థీ గ్యాంగ్ తదితర కిరాతక ముఠాలు వరుస చోరీలకు పాల్పడటం కలకలం రేపింది. మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్, అల్వాల్, బొల్లారం పోలీస్ స్టేషన్లలో పార్థీ గ్యాంగ్ సభ్యుడు, రాచకొండ పరిధిలోని మేడిపల్లిలో మహారాష్ట్రకు చెందిన థార్ ముఠా హల్ చల్ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.