Prime Minister Modi: నేడు ప్రధాని మోడీ బర్త్ డే.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విశేషాలు!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 72వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా మోడీ బాల్యాన్ని ఓసారి చూస్తే.. అతను గొప్ప నాయకుడిగా ఎలా గుర్తింపు పొందాడో అర్థ మవుతుంది.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 12:31 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 72వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా మోడీ బాల్యాన్ని ఓసారి చూస్తే.. అతను గొప్ప నాయకుడిగా ఎలా గుర్తింపు పొందాడో అర్థ మవుతుంది. భారత ప్రధానిగా ఎన్నికైన నాటి నుంచి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ మోడీ తనదైన శైలిలో ముందుకుసాగుతున్నారు. ఇంతటి విశిష్టమైన ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడైన నరేంద్ర మోడీ…తన బాల్యం నుండే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనడం జరిగింది. ఆ స్ఫూర్తిదాయక విశేషాలు తెలుసుకుందాం..

* వాద్ నగర్ పట్టణంలో జననం

దక్షిణ గుజరాత్‌‌లోని మెహసానా జిల్లా వాద్ నగర్ పట్టణంలో దామోదర్ దాస్ ముల్‌చంద్ మోడీ, హీరాబెన్ మోడీ దంపతులకు 1950 సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ జన్మించారు.

* టీ అమ్మే తండ్రికి మోడీ సాయం

వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మే తన తండ్రికి మోడీ సాయం చేసేవారు. బహిరంగ ప్రసంగాలలో అప్పుడప్పుడు టీ అమ్ముతున్న రోజుల గురించి తరచుగా మాట్లాడుతుంటారు. రైల్వే స్టేషన్‌‌లో మోడీ జీవితం.. రైల్వేలను పునరుద్ధరించడానికి ప్రేరేపించి ఉండవచ్చని అంటుంటారు. రైల్వేలను మార్చాలనే తన ప్రతిష్టాత్మక మిషన్‌కి మోడీ అపరిమితమైన అంకితభావం చూపించారు.

*మొసళ్లతో ఆట..

చైల్డ్‌వుడ్ స్టోరీస్ – బాల్ నరేంద్ర’, మోడీ జీవితంపై ఇది ఒక హాస్య పుస్తకం. అతని ధైర్యానికి ఎన్నో ఉదాహరణలు ఇందులో ఉన్నాయి. భయమెరుగని మోడీ మొసళ్లతో ఆడుకునేవారు. ఒకసారి ఒక మొసలి పిల్లను ఇంటికి తీసుకువచ్చారు. కానీ, అతని తల్లి అభ్యంతరం చెప్పడంతో దానిని తిరిగి సరస్సులో వదిలిపెట్టారు. ఒక దేవాలయంపైన జెండాను ఎగురవేయడానికి మొసలి బారినపడిన సరస్సు గుండా ఈదుకుంటూ వెళ్లారు. మరోసారి గాలిపటం తీగలలో చిక్కుకున్న పక్షిని విడిపించడానికి తన దంతాల మధ్య బ్లేడ్‌తో చెట్టుపైకి ఎక్కారు.

* 17 ఏళ్లకే దేశ పర్యటన..

17 ఏళ్ల వయసులోనే మోడీ దేశ పర్యటన నిమిత్తం ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , బీహార్ రాష్ట్రాల మీదగా పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా , డార్జిలింగ్ వరకు తిరిగారు. చివరికి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఆల్మోరా కు వెళ్లి రామకృష్ణ మఠంలో గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ల వయస్సులో ఉత్తరభారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు.

* ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరికతో మారిన జీవితం

మోదీ దేశ పర్యటన ముగించుకుని స్వగ్రామమైన వాద్‌నగర్‌కి చేరుకుని, తల్లి దగ్గర దీవెనలు తీసుకొని అహ్మదాబాద్‌లో తన మేనమామ రన్ చేస్తున్న ఆర్.టి.సి క్యాంటీన్‌లో పని చేసేవారు. తన గురువు వకీల్ సాబ్ ద్వారా ఆర్ఎస్ఎస్‌లోకి ప్రవేశించారు. వకీల్ సాబ్ అనుచరుడిగా తక్కువ కాలంలోనే అందరికి సుపరిచితులయ్యారు. మోడీ ఆధ్వర్యంలో సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్‌లో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. దీంతో కీలక బాధ్యతలు మోడీకి అప్పగించారు. 1975లో ఎమెర్జెన్సీ సమయంలో దేశంలోని ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటుగా నాయకులను రహస్యంగా దాచి పెట్టే లాంటి వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఎమెర్జెన్సీ సమయంలో గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థులను విజయవంతంగా నడిపించారు. ఎమెర్జెన్సీ తరువాత సంఘ్‌లో కీలక పదవులు అధిరోహించారు.

* రాజకీయ జీవితం..

మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేస్తున్న సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యారు. 1986లో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అద్వానీ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ఇలా గుజరాత్‌‌ బీజేపీలో కీలక వ్యక్తిగా మారారు. 1995లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు కీలకంగా మారారు. ఆ తరువాత గుజరాత్ అసెంబ్లీ విజయంతో మోడీ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేందుకు అద్వానీ.. ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించారు. ఆయా రాష్ట్రాల ఇంఛార్జిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. దీంతో బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టింది.

* ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా

2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పనిచేశారు. మొత్తం నాలుగు సార్లు గుజరాత్ సీఎంగా మోడీ పనిచేశారు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన మోడీ తిరుగులేని విజయం సాధించి తొలిసారి 2014 మే 21న భారత 15వ పీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

* కాంగ్రెసేతర తొలి ప్రధానిగా రికార్డు

దేశంలో ఎక్కువకాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. గతంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట ఈ రికార్డు ఉంది. వాజ్‌పేయి మూడు సార్లు ప్రధానిగా ఎన్నికై మొత్తం 2,272 రోజులు దేశ ప్రధానిగా పనిచేశారు. నరేంద్ర మోడీ 2022 ఆగస్టు 13న వాజ్‌పేయిని అధిగమించారు. రెండు దఫాలుగా ఇప్పటి వరకు 2,686 రోజులు దేశ ప్రధానిగా సేవలందించారు.