మాజీ సీఎం స్వర్గీయ జయలలిత స్నేహితురాలు శశికళ భోరున ఏడ్చేసింది. చెన్నై మెరీనా బీచ్ లోని అమ్మ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ఐదేళ్ల క్రితం జయ సమాధి మీద ఒట్టువేసి శపథం చేసిన శశికళ ఇప్పుడు నిస్సహాయంగా ఏడ్చేసింది. తమిళనాట ఇప్పుడే ఈ సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది.డిసెంబర్ 4 వ తేదీ నాటికి జయ మరణించి ఐదేళ్లు అయింది. ఆమె ఐదో వర్థంతి సందర్భంగా స్మారక స్థూపం వద్ద శశికళ నివాళులు అర్పించింది. ఆ సందర్భంగా భోరున విలపించింది. బెంగుళూరు జైలులో నాలుగేళ్లు ఆమె శిక్షను అనుభవించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడుకు శశికళ తిరిగి వచ్చింది. ఆమెను అన్నాడీఎంకేలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ప్రొగ్రెస్ లేదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా, జాయింట్ కోఆర్డినేటర్గా ఈపీఎస్, ఓపీఎస్లను తిరిగి ఎన్నుకుంది. వాస్తవంగా జయ మరణం తరువాత పార్టీ చీలిపోయింది. శశికళ నటరాజన్ను పార్టీ నుండి సీనియర్ నేతలు బహిష్కరించారు. ఆ తరువాత పన్నీరు సెల్వం, ఫళనీ స్వామి, రామస్వామి ఒక అంగీకారానికి వచ్చి అన్నాడీఎంకేను నడిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో శశిని మళ్లీ పార్టీలోకి తీసుకోవడానికి వాళ్లు ఇష్టపడడంలేదు. అందుకే, ఆమె ఏడ్చారా? జయ స్నేహితురాలిగా ఏమీ చేయలేకపోయానని విలపించారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.