బెంగళూరు నుంచి బిహార్ మీదుగా వెళ్తున్న విమానాన్ని పాట్నా ఎయిర్పోర్టులో పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లయిట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఒక ఇంజిన్ రెక్కలు విరిగిపోవడంతో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం అర్థాంతరంగా రద్దయింది. ఘటన జరిగినప్పుడు విమానంలో 142 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం రద్దు అయినందున ప్యాసెంజర్లు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
పాట్నా ఎయిర్ పోర్టులో పక్షులు విమానాలను ఢీకొట్టిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. విమానాశ్రయానికి అతి సమీపంలో మాంసం దుకాణాలు ఉండటంతో పెద్ద పెద్ద పక్షులు ఇక్కడ సంచరిస్తున్నాయి. మాంసం దుకాణాలను వేరే చోటకు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.