NEET: నీట్ వ్య‌తిరేక బిల్లు: ర‌చ్చ లేపిన‌ గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం.. త‌గ్గేదేలే అంటున్న‌ స్టాలిన్

  • Written By:
  • Updated On - February 4, 2022 / 02:22 PM IST

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో, తమిళనాడు అసెంబ్లీలో నీట్ పీజీ ప‌రీక్ష‌కు వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఏక‌గ్రీవ తీర్మాణంతో డీఎంకే స‌ర్కార్ తెచ్చిన బిల్లును, ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి తిర‌స్క‌రించ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలో గ్రామీణ,పేద విద్యార్థుల ప్రయోజనాలకు ఇది విరుద్ధమంటూ గ‌వ‌ర్న‌ర్ ర‌వి వ్యాఖ్య‌లు చేశారు.

నీట్‌ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని, ప్రవేశానికి ముందు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందే విద్యార్థులు ఒక శాతమైనా ఉండేవారు కాద‌ని, అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ క‌ల్పించ‌డంతో, ఆ సంఖ్య గణనీయంగా మెరుగుపడిందని గవర్నర్ ర‌వి తెలిపారు.

గ‌తంలో సీఏఏ, సాగుచట్టాలపై ఓటింగ్‌ జరిగినప్పుడు, నీట్ పీజీ ప‌రీక్షను ర‌ద్దు చేయాలన్న షరతును పెట్టి ఉంటే కేంద్ర స‌ర్కార్ ఆనాడే నిర్ణయం మార్చుకునేదని, నీట్ పీజీ ప‌రీక్ష ఒత్తిడిని త‌ట్టుకోలేక విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డుతున్నార‌ని, బీజేపీ స‌ర్కార్ తాజాగా తెచ్చిన‌ నీట్ పీజీ ప‌రీక్ష విధానంతో నిరుపేద‌, ద‌ళిత విద్యార్ధుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని స్టాలిన్ అన్నారు.

ప్రైవేట్ కోచింగ్ తీసుకునే స్థోమ‌త ఉన్న విద్యార్ధులు మాత్ర‌మే నీట్ ప‌రీక్ష పాస్ అవుతున్నార‌ని, గ్రామీణ ప్రాంత విద్యార్ధులు నీట్ ప‌రీక్ష కార‌ణం తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని సీయం స్టాల్ అన్నారు. మ‌రోవైపు తమిళ ప్రజలంతా గవర్నర్‌ రవి నిర్ణయం పై సోష‌ల్ మీడియాలో ట్విటర్ వేదిక‌గా.. గెట్‌ అవుట్‌ రవి యాష్‌ ట్యాగ్‌తో తీవ్ర‌స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.