Site icon HashtagU Telugu

North East Monsoon: నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు… ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి!

North East Monsoon

North East Monsoon

North East Monsoon: నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. ఈ సమయంలో, దక్షిణ భారతంలోని ఐదు వాతావరణ సబ్‌డివిజన్లలో వర్షాలకు అనుకూలంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి, ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది.

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కోస్తా, రాయలసీమ, తమిళనాడు/పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో వర్షాలు కురిసే వాతావరణం ఉంటుందని అంచనా. 1971 నుండి 2020 వరకు ఈ ఐదు సబ్‌డివిజన్లలో సగటు 334.13 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది, అయితే ఈ ఏడాది సాధారణం కంటే 15 శాతం ఎక్కువ (దీర్ఘకాలిక సగటులో 115 శాతం) వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది.

తమిళనాడులో ఏడాదిలో కురవాల్సిన వర్షపాతంలో ఈ సీజన్‌లోనే 48 శాతం, దక్షిణాదిలోని ఐదు సబ్‌డివిజన్లలో 30 శాతం వర్షపాతం నమోదుకావాల్సి ఉంది. గతేడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో తూర్పు/ఈశాన్య గాలులు ప్రారంభమవ్వడంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సీజన్‌లో దక్షిణ కోస్తా, తమిళనాడుకు తుఫాన్‌లు తాకుతాయని సూచించారు. పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు ‘లానినా’గా మారే అవకాశం ఉన్నా, ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో మంచి వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు చెప్పారు. ఉత్తర, ఈశాన్య, తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావడం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చింది.

Exit mobile version