తమిళనాడులోని హోసూర్ ప్రభుత్వ పాఠశాలలో వందమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వారి ఆరోగ్యం క్షీణించింది. వాంతులు అవుతున్నాయని ఫిర్యాదు చేయడంతో విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చారు. మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. పాఠశాల ఆవరణలో నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే విద్యార్థులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారి ఆరా తీశారు. ఆసుపత్రికి వెళ్లి అక్కడ విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో పాఠశాలలో విద్యార్థులు ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే వారిని హోసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య అధికారులు PTI కి ఇచ్చిన సమాచారం ప్రకారం, దాదాపు 67 మంది బాలికలు ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. వారి ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. ఘటన అనంతరం కాలుష్య నియంత్రణ మండలి, హోసూర్ కార్పొరేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించారు.