WhatsApp Message : మోడీ సర్కారు వాట్సాప్ మెసేజ్‌పై వివాదం

WhatsApp Message : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.

  • Written By:
  • Updated On - March 17, 2024 / 01:31 PM IST

WhatsApp Message : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ దిశగా దొరికే ప్రతీ అంశాన్ని రాజకీయం చేసేందుకు అవి సమాయత్తం అయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలను తమ వైపు ఆకట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌లో ప్రజలకు ఒక మెసేజ్(WhatsApp Message) పంపింది. ‘వికసిత్ భారత్ సంపర్క్’ అనే యూజర్ నేమ్ కలిగిన వాట్సాప్ అకౌంట్ నుంచి ఈ మెసేజ్ దేశవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లకు సర్క్యులేట్ అయింది. ఈ వార్త చదువుతున్న వారు కూడా చాలామంది ఈ మెసేజ్‌ను చూసే ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘గత పదేళ్లలో దేశంలోని 140 కోట్ల కంటే ఎక్కువ మంది పౌరులు భారత ప్రభుత్వ పథకాల నుంచి ప్రత్యక్షంగా లబ్ది పొందారు. భవిష్యత్తులో కూడా వాటి నుంచి ప్రయోజనం పొందుతారు. అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ వంతుగా మాకు సూచనలు చాలా అవసరం’’ అని ఆ మెసేజులో ప్రస్తావించారు. దీనిపై అభిప్రాయాలను తెలపాల్సిందిగా నెటిజన్లను కోరారు.అయితే ఇప్పుడు ఈ మెసేజ్‌పై ఓ వివాదం మొదలైంది. బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారం కోసం ప్రజలకు సందేశాలు పంపిస్తూ.. ప్రభుత్వ డేటాను దుర్వినియోగం చేస్తోందని కేరళలోని కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీడ్‌బ్యాక్ ముసుగులో రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించింది. ఈ అంశం ప్రస్తుతం ట్విట్టర్‌లో చర్చనీయ అంశంగా మారింది. అయితే ఎన్నికల కోడ్ రాకముందే ఈ వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ అయిందని సమాచారం. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రజలందరికీ  ఎలా సందేశాలు పంపిస్తారని నిలదీస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు పార్టీ తరఫున పంపించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.

Also Read :CM Revanth : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌తో చేరుతారనుకోను : సీఎం రేవంత్