Site icon HashtagU Telugu

Nithyananda: నన్ను కాపాడండి.. నిత్యానంద శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘేకు లేఖ…!!

Nithyananda Swamy

Nithyananda Swamy

కర్ణాటకకు చెందిన వివాదాస్పద స్వామీజీ,అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తనను కాపాడమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘేకు లేఖ రాశారు. భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద సెంట్రల్ లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్‌లో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఓ దీవిని కొనుగోలు చేశాడు. 2019లో దాన్ని తన సొంత దేశంగా ప్రకటించుకుని, దానికి ‘కైలాస’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ భూమిపై ఉన్న గొప్ప హిందూ దేశం కైలాస అని నిత్యానంద ప్రకటించాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం క్షీణించిందని, తనకు ప్రాణహాని ఉందని, కైలాస దేశంలో మెరుగైన వైద్యం లేదని, అందువల్ల తనకు మెరుగైన వైద్యం అందించాలని నిత్యానంద శ్రీలంక అధ్యక్షుడిని కోరారు. ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు.

కాగా, నిత్యానంద స్వయంగా ప్రకటించుకున్న ద్వీప రాజ్యం కైలాసకు పాస్‌పోర్టు ఉంది. జాతీయ జెండా, జాతీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కైలాస దేశం కోసం kailaasa.org పేరుతో వెబ్‌సైట్‌ను కూడా నిత్యానంద ప్రారంభించారు. కైలాస దేశంలో వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు కొరతగా ఉండటంతో వైద్య సహాయం, అలాగే భారత్ లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నందున నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు తెలుస్తోంది.