Mysuru Maharaja : మైసూర్ రాజవంశ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మైసూరు-కొడగు లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. దీంతో సోమవారమే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈనెల 3న నామినేషన్ దాఖలు చేయాలని భావించారు. అయితే సోమవారం మంచిరోజు కావడంతో యదువీర్ రెండు రోజుల ముందే నామినేషన్ వేసినట్లు సమాచారం. తన తల్లి ప్రమోదా దేవి, బీజేపీ ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లి రెండు సెట్లు నామినేషన్ పత్రాలు అధికారికి అందజేశారు. మరో సెట్ను బుధవారం దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడ్విట్లో తన ఆస్తుల వివరాలను యదువీర్ వెల్లడించారు. పూర్తి వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
- యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ మొత్తం ఆస్తుల విలువ రూ.4.99 కోట్లు.
- ఆయనకు సొంత ఇల్లు, భూమి, కారు లేవు. ఈవిషయాన్ని ఎన్నికల అఫిడ్విట్లో ప్రస్తావించారు.
- తన పేరిట ఉన్న మొత్తం ఆస్తుల్లో రూ.3.39 కోట్లు బంగారు, వెండి ఆభరణాలు, నగల రూపంలో ఉన్నాయని యదువీర్ పేర్కొన్నారు.
- యదువీర్ భార్య త్రిషిక కుమారీ పేరిట రూ.1.04 కోట్ల ఆస్తులు, వారి పిల్లల పేరిట రూ.3.64 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వారి ముగ్గురి పేరిట ఎటువంటి స్థిరాస్తులు లేవు.
- యదువీర్ భార్యకు రూ.1.02 కోట్ల విలువైన ఆభరణాలు, వారి పిల్లలకు రూ.24.50లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి.
- 2013లో శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడియార్ కన్నుమూసిన రెండేళ్లకు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ మైసూరు 27వ రాజుగా పట్టాభిషక్తులయ్యారు.
- అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్లో యదువీర్ డిగ్రీ పూర్తి చేశారు.
- 2016లో దుంగార్పుర్ యువరాణి త్రిషికను యదువీర్ పెళ్లి చేసుకున్నారు.
కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉన్నారంటే..
మైసూరు-కొడగు లోక్సభ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ ఫోకసే పెట్టింది. మైసూరుపై తన పట్టును నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారు. ఈ స్థానం నుంచి కర్ణాటక పీసీసీ అధికార ప్రతినిధి కె.లక్ష్మణ్ను బరిలోకి దింపారు. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రతాప సింహను పక్కన పెట్టి మరీ మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీరకు టికెట్ ఇచ్చింది.
మైసూరు రాజ్యం చరిత్ర
- మైసూరు రాజ్యాన్ని వడియార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది.
- స్వాతంత్య్రానికి కొద్ది రోజుల ముందు మైసూరు రాజ కుటుంబం బ్రిటిష్ వారి తరపున పాలన అందించే రాజులుగా, గవర్నర్గా సేవలు అందించారు.
- స్వాతంత్య్రానంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర ఒడియార్ గవర్నర్గా నియమితులయ్యారు.
- శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడియార్ 1974లో రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. ఆయన 1984-1999 మధ్య కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా నాలుగుసార్లు గెలిచారు. 2013లో ఆయన కన్నుమూశారు.
- దీంతో యదువీర్ మైసూరుకు 27వ రాజుగా బాధ్యతలు చేపట్టారు.
- మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత ఒడియార్ వారసుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.