MVA Meeting: కర్ణాటక మోడల్ను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్.ముంబైలోని తన నివాసంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నేత డి.రాజాను కలిసిన అనంతరం శరద్ పవార్ విలేకరులతో మాట్లాడారు. ఈ భేటీలో బీజేపీకి ప్రత్యామ్నాయంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో పవార్ మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఓ సందేశాన్ని ఇచ్చాయి. కర్నాటక తరహా పరిస్థితిని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు కృషి చేయాలి. ఇతర రాష్ట్రాల్లో భావసారూప్యత కలిగిన పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలని అన్నారు.
ఈ సందర్భంగా డి.రాజా కూడా బీజేపీని ఓడించేందుకు పరస్పర అవగాహన గురించి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికలను ప్రస్తావిస్తూ… 2024 లోక్సభ ఎన్నికలు మరియు మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాదికి ధైర్యం ఇచ్చిందని, 2024లో చిన్న పార్టీలను కలుపుకుని అధికార పార్టీకి ఉమ్మడిగా సవాల్ విసురుతుందని ఎన్సీపీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు జయంత్ పాటిల్ అన్నారు.
శరద్ పవార్ నివాసంలో జరిగిన ఎంవీఏ సమావేశానికి హాజరైన అనంతరం పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంవీఏ నియోజకవర్గాలు సీట్ల పంపకం ఫార్ములా రూపొందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాకరే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సహా ఎంవీఏ నేతలు పాల్గొన్నారు. కర్నాటకలో మాదిరిగానే మహారాష్ట్రలోనూ ఎంవీఏ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని, మరింత పటిష్టంగా పనిచేస్తుందని పాటిల్ అన్నారు.
Read More: Karnataka CM: కర్ణాటక సీఎం ఎవరన్న దానిపై ఖర్గే కసరత్తు