Left Vs Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఓ వైపు ఇండియా కూటమిలో వామపక్షాలతో కలిసి నడుస్తున్న రాహుల్.. మరోవైపు వయనాడ్లో వామపక్ష పార్టీలను ఢీ కొంటున్నారు. ఈ భిన్నమైన రాజకీయ పరిస్థితిపై అంతటా చర్చ నడుస్తోంది. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తుండటంపై వామపక్ష పార్టీల అగ్రనేతలు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.
We’re now on WhatsApp. Click to Join
వయనాడ్ స్థానం విశేషాలు
- వయనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సీపీఐకి చెందిన జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా పోటీ చేస్తున్నారు.
- ఈమె సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి.
- 2008 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి వయనాడ్ లోక్సభ స్థానం కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది.
- కేరళ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, దివంగత ఎంఐ షానవాస్ 2009, 2014 ఎన్నికల్లో వయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
- 2019లో వయనాడ్, అమేథీ లోక్సభ స్థానాల నుంచి పోటీచేసిన రాహుల్.. అమేథీలో ఓడిపోగా, వయనాడ్ నుంచి గెలిచారు. అప్పట్లో వయనాడ్లో 4,31,770 ఓట్లతో సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్పై రాహుల్ గాంధీ విజయఢంకా మోగించారు.
Also Read : Rs 5 Lakh Per Newborn : ఒక శిశువుకు రూ.5 లక్షల రేటు.. పిల్లలు అమ్మే గ్యాంగ్పై సీబీఐ దర్యాప్తు
బీజేపీని వదిలేసి వామపక్షాలనే టార్గెట్ చేశారు : డి.రాజా
కూటమిలోని మిత్రపక్షం అభ్యర్థిపై రాహుల్ గాంధీ పోటీచేయడం సరికాదని సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా భర్త, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏకమై పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడలను పాటించడం ఆందోళనకరమన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీని బలంగా ఢీకొనాలని భావిస్తే హిందీ బెల్ట్లోని ఏదైనా లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఉండాల్సిందన్నారు. నేరుగా బీజేపీతో రాహుల్ ఎందుకు తలపడటం లేదని నిలదీశారు.
సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ ఏమన్నారంటే..
‘‘బీజేపీని ఎదుర్కోవాలనేదే ఇండియా కూటమి లక్ష్యమైనప్పుడు.. వయనాడ్లో కూడా అదే జరగాలి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ రెండు కూడా అభ్యర్థులను నిలబెట్టాయి’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ కాకుండా మరేదైనా సీటు నుంచి పోటీ చేసి ఉండాల్సిందని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు.