Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కు చికిత్స అందించిన వైద్యుడికి పోలీస్ రక్షణ

కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ కి చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ రమణారావుకు పోలీసులు రక్షణ కల్పించారు.

  • Written By:
  • Publish Date - November 7, 2021 / 02:16 PM IST

కర్ణాటక : కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ కి చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ రమణారావుకు పోలీసులు రక్షణ కల్పించారు. పునీత్ మరణానికి వైద్యుల నిర్లక్ష్యం కారణమని సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ పునీత్ కి చికిత్స చేసిన డాక్టర్లకి, ఆసుపత్రికి రక్షణ ఇవ్వాలని పోలీసులను కోరారు. సదాశివనగర్ లోని డాక్టర్ రమణారావు నివాసం, క్లినిక్ వెలుపల పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ తో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని బెంగుళూరు పోలీసులు తెలిపారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసన్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశారు.దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తరువాత ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు తమకు ఆందోళన కలిగించాయని లేఖలో పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమార్ ని బ్రతికించడం కోసం తన వంతు కృషి చేసిన డాక్టర్ రమణరావుపై ఆరోపణలను చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇదే విషయం కొన్ని టీవీ ఛానెళ్లు,య్యూటూబ్ ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయని లేఖలో ఆరోపించారు.ఈ రకమైన ప్రచారం సమాజంలో అపనమ్మకాన్ని సృష్టిస్తోందని…అలాగే మరణించిన వారికి సేవ చేసిన వైద్య నిపుణుల జీవితాలకు ప్రమాదం కలిగిస్తుందని లేఖలో పేర్కొన్నారు.