KSRTC Protest : కర్ణాటకలో ఆర్టీసీ సమ్మె.. బోసిపోయిన బస్టాండ్స్

KSRTC Protest : ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. బెంగళూరుతో పాటు మైసూరు, హుబ్బళ్లి, మంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది

Published By: HashtagU Telugu Desk
Ksrtc Protest

Ksrtc Protest

కర్ణాటకలో KSRTC ఉద్యోగుల సమ్మె (KSRTC Protest) తీవ్ర ప్రభావం చూపుతోంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమవడంతో ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. బెంగళూరుతో పాటు మైసూరు, హుబ్బళ్లి, మంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సుల కోసం బస్టాండ్లలో గంటల తరబడి ఎదురుచూసి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.

KSRTC ఉద్యోగులు 12 కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ముఖ్యంగా, 38 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాల బకాయిలను వెంటనే చెల్లించడం, 15 శాతం జీతాల పెంపు వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి. ఈ డిమాండ్లపై సోమవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అయితే, ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు మాత్రమే అంగీకరించింది. ముఖ్యంగా, ఆర్థిక భారం పడని అంశాలను మాత్రమే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీనికి ఉద్యోగుల జేఏసీ అంగీకరించలేదు, చర్చలు విఫలమయ్యాయి. దీంతో నిరవధిక సమ్మె అనివార్యమైంది.

సమ్మెను అడ్డుకునే ప్రయత్నంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీనియర్ అడ్వొకేట్ ఎన్.పీ. లమృతేష్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, సమ్మెను వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఆధారంగా KSRTC మేనేజింగ్ డైరెక్టర్ అక్రమ్ పాషా ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసి, సమ్మెలో పాల్గొనవద్దని సూచించారు. అయితే, జేఏసీ అధినేత అనంత సుబ్బారావు హైకోర్టు ఉత్తర్వులలో స్పష్టత లేదని, తమ వాదనలను కోర్టుకు వినిపిస్తామని, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ప్రభుత్వ హెచ్చరికలకు భయపడవద్దని ఉద్యోగులకు సూచించారు.

సమ్మె కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోడ్డు రవాణా సంస్థలైన KSRTC, BMTC, NWKRTC, KKRTC బస్సులు నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆపరేటర్లు, ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది సామాన్య ప్రజలపై మరింత భారం వేస్తోంది. ప్రజా రవాణాపై ఆధారపడిన లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమ్మె ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో, ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది.

  Last Updated: 05 Aug 2025, 09:39 AM IST