Safest City : మన దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరం ఏదో తెలుసా ? కోల్కతా!! ఎందుకు .. అంటే.. దానికి కూడా ఆన్సర్ ఉంది. ఈ ఆన్సర్ చెప్పింది ఎవరో కాదు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB). మహానగరాలలో ప్రతి లక్ష జనాభాకు సగటున అతి తక్కువ నేరాలు నమోదవుతున్న గణాంకాలను NCRB నమోదు చేసింది. ఈ లెక్కన తక్కువ నేరాలు నమోదవుతున్న నగరంగా నిలిచినందున కోల్కతాను సురక్షితమైన నగరంగా ప్రకటించింది. వరుసగా మూడో ఏడాది కూడా మన దేశంలో సురక్షితమైన నగరంగా కోల్కతా నిలవడం విశేషం. 2022 సంవత్సరంలో కోల్కతాలో ప్రతి లక్ష మందికి సగటున 86 కాగ్నిజబుల్ నేరాల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీని తర్వాతి స్థానంలో పూణే నిలిచింది. ఇక్కడ 2022 సంవత్సరంలో ప్రతి లక్ష జనాభాకు సగటున 280 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదవగా.. మన హైదరాబాద్లో సగటున 299 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే.. దేశంలోని సేఫెస్ట్ సిటీలలో మన హైదరాబాద్ ర్యాంకు మూడు.
We’re now on WhatsApp. Click to Join.
- NCRB నివేదిక ప్రకారం.. కోల్కతాలో 2021 సంవత్సరంలో ప్రతి లక్ష జనాభాకు సగటున 103 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అది బాగా తగ్గి 86కు చేరడం గమనార్హం. 2020లో కోల్కతాలో ఈ సంఖ్య 129గా ఉండేది. గత మూడేళ్లలో ఆ నగరంలో నేరాలు తగ్గాయి అనేందుకు ఈ లెక్కలే సంకేతం.
- 2021 సంవత్సరంలో పూణేలో ప్రతి లక్ష జనాభాకు సగటున 256 కేసులు నమోదవగా.. హైదరాబాద్లలో ప్రతి లక్ష జనాభాకు సగటున 259 కేసులు నమోదయ్యాయి.
- 20 లక్షలకు పైగా జనాభా కలిగిన 19 నగరాలలో నమోదైన కాగ్నిజబుల్ నేరాల కేసుల సంఖ్యను పోల్చి NCRB ఈమేరకు ర్యాంకింగ్స్ ఇచ్చింది.
- కోల్కతాలో మహిళలపై నేరాల రేటు 27.1గా ఉంది. అంటే 2022 సంవత్సరంలో ప్రతి లక్ష మంది కోల్కతా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు సగటున 27 నమోదయ్యాయి.
- మహిళలపై నేరాల రేటు తమిళనాడులోని కోయంబత్తూర్లో చాలా తక్కువగా నమోదైంది. 2022 సంవత్సరంలో ప్రతి లక్ష మంది కోయంబత్తూర్ మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు సగటున 13 మాత్రమే(Safest City).
- తమిళనాడులోని చెన్నై నగరంలోనూ మహిళలపై నేరాల రేటు 17 మాత్రమే.