Governor Vs CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సీఎంపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై భౌతిక దాడి చేయించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుట్ర పన్నారని కేరళ గవర్నర్ ఆరోపించారు. అధికార పార్టీ సీపీఐ(ఎం)కు చెందిన విద్యార్థి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) సభ్యులు తన వాహన కాన్వాయ్ని అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ న్యూఢిల్లీకి వెళ్లేందుకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరగా మార్గం మధ్యలో మూడు చోట్ల జరిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తల నిరసనలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన గవర్నర్ ఖాన్(Governor Vs CM).. ‘‘నాపై భౌతిక దాడి చేయించేందుకు ముఖ్యమంత్రి విజయన్ కుట్ర చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు. వ్యక్తిగతంగా నన్ను లక్ష్యంగా చేసుకొని.. ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య ఇది’’ అని మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగుతుంటే ఆందోళనకారులతో ఉన్న కార్లను అక్కడికి పోలీసులు అనుమతిస్తారా ? మరి నా విషయంలో పూర్తి విరుద్ధంగా పోలీసులు దగ్గరుండి మరీ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను నిరసనల కోసం పంపినట్టుగా అనిపిస్తోంది. అప్పటివరకు నిరసనకారులంతా రోడ్డుపక్కన కార్లలో కూర్చొని ఉన్నారు. నా కారును చూడగానే బయటికి వచ్చి చుట్టుముట్టారు.. నేను కారు దిగగానే ఎస్ఎఫ్ఐ నిరసనకారులంతా పారిపోయారు’’ అని గవర్నర్ వివరించారు.
Also Read: Miss India USA – 2023 : రిజుల్ మైనీకి ‘మిస్ ఇండియా యూఎస్ఏ’ కిరీటం
‘‘ఆ నిరసనకారులంతా నాపై దాడి చేయడానికి వచ్చారని అనిపిస్తోంది. వాళ్లను పంపించింది ముఖ్యమంత్రే. తిరువనంతపురం రోడ్ల బాధ్యతలను గూండాలు చేపట్టారు’’ అని గవర్నర్ ఖాన్ సంచలన కామెంట్ చేశారు. ఇక తిరువనంతపురం పోలీసుల వాదన మరోలా ఉంది. గవర్నర్ ఖాన్ వాహనాన్ని ఒకచోట అడ్డుకున్న SFI కార్యకర్తలలో ఏడుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు.