Yuva Nidhi Scheme : నిరుద్యోగుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.3వేలు.. డిప్లొమా చదివిన వారికి నెలకు రూ.1,500 ఇస్తామన్నా యూత్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 2023 డిసెంబరు 26 నుంచి ఇప్పటివరకు అంటే వారం వ్యవధిలో కేవలం 19,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు త్వరలోనే అమల్లోకి తేనున్న ‘యువనిధి’ పథకానికి దరఖాస్తులు అందుతున్న తీరు వివరాలివి!! ఇంతకీ నిరుద్యోగ భృతి కోసం యువత ఎందుకు అప్లై చేయడం లేదు ? అనే దానిపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో యువనిధి పథకానికి 5.3 లక్షల మంది అర్హులు ఉన్నారని కర్ణాటక ప్రభుత్వం(Yuva Nidhi Scheme) గుర్తించింది. వీరిలో 4.8 లక్షల మంది గ్రాడ్యుయేట్లు కాగా, 48,100 మంది డిప్లొమా హోల్డర్లు ఉన్నారు. అయితే యువనిధి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు 19,800 మందే నమోదు చేసుకున్నారు. యువనిధి పథకానికి అర్హులైన నిరుద్యోగుల సంఖ్యలో ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్లు కేవలం 4 శాతమే. 19,800 అప్లికేషన్లలో దాదాపు 10వేల అప్లికేషన్లు కర్ణాటకలోని 10 జిల్లాల నుంచి వచ్చాయి. మిగతా 10వేల అప్లికేషన్లు ఇంకో 21 జిల్లాల నుంచి వచ్చాయి.
కర్ణాటకలోని చాలావరకు జిల్లాల్లో యువనిధి స్కీమ్పై పెద్దగా ప్రచారం జరగలేదని పరిశీలకులు అంటున్నారు. దరఖాస్తు ప్రక్రియపై గ్రామీణ నిరుద్యోగ యువతకు సరైన అవగాహన లేకపోవడంతో వారు త్వరితగతిన అప్లికేషన్లను సమర్పించలేకపోతున్నారని చెబుతున్నారు. అర్హులు సేవాసింధు పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. అర్హులైన నిరుద్యోగులకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుంచి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో నిరుద్యోగ భృతి కూడా ఒకటి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘నిరుద్యోగ భృతి అనేది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో గానీ, మ్యానిఫెస్టోలో గానీ తాము చెప్పలేదు’’ అని స్పష్టం చేశారు.