కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ విశ్వనాథ్ కత్తితో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెంగళూరు డాలర్ కాలనీలో నివసిస్తున్నారు. నిన్న బాత్రూములో కాలుజారి కిందపడిపోయారు. ఆకస్మత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం బీజేపీకి తీరని లోటన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్. అశోక.
ఉమేశ్ కత్తి మరణవార్త విన్న సీఎం బసవరాజ్ బొమ్మై షాక్ కు గురయ్యారు. మంచి లీడర్ ను కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమేశ్ మరణ వార్త తెలిసి వెంటనే కేబినెట్ సహచరులు గోవింద్ కర్జోల్, కె. సుధాకర్ సహా పలువురు బీజేపీ నేతలు ఆసుపత్రి వెళ్లారు. ఉమేశ్ మరణం బాధాకరమన్నారు ప్రతిపక్ష నేత సిద్దిరామయ్య. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు.
కాగా ఉమేశ్ కత్తి హుక్కేరి నుంచి ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1985లో ఆయన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణం తర్వాత ఉమేశ్ కత్తి రాజకీయప్రవేశం చేశారు. ఉత్తర కర్నాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉమేశ్ కత్తి వార్తల్లో నిలిచారు.