ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అతనిపై పెద్ద అంచనాలు లేవు..స్టార్ క్రికెటర్ అయినప్పటికీ నాలుగు శతకాలు కొడతాడనీ అనుకోలేదు. సీజన్ ప్రారంభం అయ్యాక వరుస సెంచరీలతో దుమ్మురేపాడు..అతనే జోస్ బట్లర్…ఐపీఎల్ 15వ సీజన్ రెండో క్వాలిఫైయర్ లో బెంగుళూరు పై సెంచరీ ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. ఫలతంగా రాజస్థాన్ ఫైనల్ కు దూసుకెళ్లింది.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరో తేలిపోయింది. టాప్ ఫామ్లో దూసుకెళ్తూ నాలుగు సెంచరీలతో విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బట్లర్ ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ గెలవనున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ అతడు 16 మ్యాచ్లలో 58.85 సగటుతో 824 పరుగులు చేశాడు.
అతనికి సమీపంలో కూడా ఎవరూ లేరు. రెండో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 616 రన్స్ చేశాడు. అయితే ఇప్పటికే ఆ టీమ్ ఇంటికెళ్లిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఆడుతున్న గుజరాత్ టైటన్స్ టీమ్ నుంచి కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా 453 రన్స్ చేశాడు.
ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న సీజన్లో బట్లర్ ఆరెంజ్ క్యాప్ గెలవడం లాంఛనమే. అయితే అతడు ఈ సీజన్ను చివరిగా ఎన్ని రన్స్తో ముగిస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెంచరీల విషయంలో ఇప్పటికే విరాట్ కోహ్లిని సమం చేసిన బట్లర్.. ఫైనల్లో మరో సెంచరీ బాదితే ఐపీఎల్లో చరిత్ర సృష్టిస్తాడు. అలాగే ఒకే సీజన్ లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది.