2016లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపిన జస్టిస్ ఎ. ఆరుముఘస్వామి కమిషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె సహాయకురాలు వి.కె.శశికళ పాత్ర (తప్పులు) ఉందనీ, దర్యాప్తునకు ఆదేశించాలని పేర్కొంది. జయలలిత మరణం, 2018లో రాష్ట్రంలోని తూత్తుకుడిలో పోలీసుల కాల్పులకు సంబంధించిన పరిస్థితులపై ప్రత్యేక విచారణ కమిషన్ల నివేదికలను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శశికళతో పాటు మరికొందరి పేర్లను కూడా కమిటీ పేర్కొంది.
2018లో తూత్తుకుడిలో స్టెరిలైట్ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ అరుణ జగదీశన్ విచారణ కమిషన్ పోలీసు అధికారులను తప్పుబట్టింది. అంతకుముందు.. మాజీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) అధినేత ఆసుపత్రిలో చేరిన పరిస్థితులను పేర్కొంటూ కమిషన్ తన నివేదికను ఆగస్టు 27న సీఎం స్టాలిన్కు సమర్పించింది. డిఎంకె నేతృత్వంలోని ప్రభుత్వం శశికళ, మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహనరావు, మాజీ ఆరోగ్య మంత్రి సి విజయభాస్కర్తో పాటు మరికొందరిపై తప్పనిసరిగా విచారణ జరపాలని నివేదిక సిఫార్సు చేసింది.
600 పేజీల నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి, సిఫారసులకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించాలని నిర్ణయించింది. జయలలిత మరణానికి సంబంధించిన వాస్తవాలను బయటపెడతామని డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. జయలలిత సెప్టెంబర్ 22, 2016 న చెన్నైలోని అపోలో హాస్పిటల్స్లో చేరారు. అదే సంవత్సరం డిసెంబర్ 5 న మరణించే వరకు 75 రోజుల పాటు అక్కడ చికిత్స పొందారు.
అయితే AIIMS మూడు-పేజీల రిపోర్ట్ ను అందించింది. జయలలిత మరణించే వరకు ఏం జరిగిందో ఈ రిపోర్ట్ సూచిస్తోంది. నవంబర్ 30, 2021న సుప్రీం కోర్ట్, ఆరుముఘస్వామి కమిషన్కు సహాయం చేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా ఎయిమ్స్ను ఆదేశించాలని అపోలో హాస్పిటల్ చేసిన విజ్ఞప్తిని అంగీకరించింది.