ఏపీలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తభించింపోయింది. తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద ధాటికి ముఖ్యంగా దక్షిణాంధ్ర, రాయలసీమ అల్లాడిపోయింది. వరద ప్రభావంతో అతలా కుతలమైన మూడు జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 2,3 తేదీల్లో జగన్ తన సొంత జిల్లా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్కు పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
రెండో తేదీన గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయలదేరి గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో రాజంపేట మండలం మదనపల్లి చేరుకుంటారు. పులపాతూరు గ్రామంలో సీఎం పర్యటిస్తారు. భారీగా దెబ్బ తిన్న గ్రామాన్ని సందర్శించి..బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. సహాయ శిబిరాలను సందర్శించి..గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి మందపల్లి గ్రామానికి వెళ్లనున్నారు. ఆ తరువాత వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం ప్రాంతాన్ని సీఎం స్వయంగా పరిశీలిస్తారు.

