ఏపీ ట్రెజరీ అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయిస్తున్న టీడీఎస్ మొత్తాన్ని వెంటనే చెల్లించకపోవడంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఏపీలోని అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులు, సబ్ ట్రెజరీ అధికారులకు ఐటీ అధికారులు లేఖలు పంపించారు. బెజవాడలోని ఐటీ శాఖ, టీడీఎస్ రేంజ్ నుంచి అందరికీ తాఖీదులు వెళ్లాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల ఉద్యోగుల నుంచి టీడీఎస్ వసూలు చేశారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. టీడీఎస్ మొత్తాన్ని ఏడాది చివరి వరకు జమ చేయలేదన్న ఐటీ అధికారులు.. వెంటనే ప్రతినెల టీడీఎస్ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఆదేశించారు. ఆలస్యంగా చెల్లిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 192(1) ప్రకారం.. వడ్డీ వసూలు చేస్తామని ఐటీ శాఖ హెచ్చరిక జారీ చేసింది.