హుక్కా బార్లను నిషేధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. హుక్కా బార్లతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. పొగాకు కొనుగోలుకు చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు యువకులు హుక్కా బార్లను సందర్శిస్తున్నారని.. ఈ పొగాకు వినియోగం మానేయాలని, అందుకోసం చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వ్యసనానికి దారితీసే హుక్కాలో ఉపయోగించే తెలియని పదార్థాలను ఉంటాయని ఆయన పేర్కొన్నారు. హుక్కా తినే సమయంలో ఎలాంటి పదార్థాలు జోడించబడతాయో తెలియదని.. ఆ పదార్థాలు వారిని వ్యసనానికి గురి చేస్తున్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA)కి సవరణలు ప్రతిపాదించింది. ప్రస్తుత COTPA బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, విద్యాసంస్థలకు 100 గజాలలోపు పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని నిషేధిస్తుందని.. అయితే ప్రతిపాదిత సవరణలు ఈ నిషేధాన్ని ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, మతపరమైన సంస్థల చుట్టూ ఉన్న ప్రాంతాలకు విస్తరించాలని కర్ణాటక ప్రభుత్వం సవరణలు చేసింది.