Water Crisis : అది మన దేశానికి ఐటీ హబ్. కానీ తాగునీటి కోసం అల్లాడిపోతోంది. ఇటీవల కనీస అవసరాలకు నీరు దొరకక ఆ నగరం ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారు. అలాంటి మెగా సిటీలో లోక్సభ ఎన్నికలు కీలకంగా మారాయి. తమ ఆగ్రహాన్ని ప్రజలు ఓటు ద్వారా వ్యక్తం చేసేందుకు సరైన టైం వచ్చింది. అందుకే ఆ నగరం పరిధిలో పోటీ చేస్తున్న లోక్సభ అభ్యర్థులకు ‘జల’దరింపు కలుగుతోంది. నీటి కోసం కోటి తిప్పలు పడిన బెంగళూరు ప్రజలు ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనే దానిపై యావత్ కర్ణాటక రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
నీటి కోసం అరిగోస(Water Crisis) పడిన బెంగళూరు సిటీ పరిధిలో నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఈనెల 26న పోలింగ్ జరగబోతోంది. ఈ సీట్ల పరిధిలో స్థానికుల కంటే వలస వచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో జీవిస్తుంటారు. వారు తమకు సౌకర్యాలు కల్పించే పార్టీలకే పగ్గాలు అప్పగిస్తారు. అంతకుమించి ఆలోచించే టైం అక్కడి వారికి ఉండదు. ఎందుకంటే.. మన దేశంలోని బిజీ సిటీల్లో బెంగళూరు ఒకటి. అందుకే తాగునీటి కొరత ఎఫెక్టు తమ ఫలితాలపై పడుతుందని ఈ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ తేదీ నాటికి బెంగళూరులో నీటి సమస్య తీవ్రరూపు దాల్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఇక్కడి ఓటర్ల ఆగ్రహాన్ని రాజకీయ పార్టీలు చూస్తాయి. అది ‘నోటా’ రూపంలో బయటపడే అవకాశమూ లేకపోలేదు.
ఇక పొలిటికల్ లెక్కల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని లోక్సభ స్థానాాల్లో మొదటినుంచీ బీజేపీ హవాయే వీస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సిటీ పరిధిలోని నాలుగు లోక్సభ స్థానాలకుగానూ మూడింటిని బీజేపీ గెల్చుకుంది. బెంగళూరు సిటీ నీళ్ల సమస్యకు కారణం మీరంటే.. మీరే అంటూ బీజేపీ, కాంగ్రెస్లు పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది వర్షాలు పడలేదని తెలిసి కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని బీజేపీ అంటోంది. అనధికారింగా లక్ష బోర్లకు అనుమతి ఇవ్వడం నగరంలో నీటి కొరత ఏర్పడిందని కాషాయ పార్టీ వాదిస్తోంది.కేఆర్ఎస్ జలాశయంలో నీరు లేకున్నా తమిళనాడుకు నీటిని విడుదల చేసిన కాంగ్రెస్ సర్కారే ఈ సమస్యకు బాధ్యత వహించాలని బీజేపీ అంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగళూరుకు నీటి వసతిని కల్పించే మేకెదాటు ప్రాజెక్టుకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కరువు పరిహారాన్ని మోడీ సర్కారు సకాలంలో చెల్లించకపోవడం వల్లే తాము తాగునీటి సదుపాయాన్ని బెంగళూరు ప్రజలకు అందించలేకపోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తోంది. ఏ పార్టీ ఆరోపణ ఎలా ఉన్నా.. సమస్య ఎదుర్కొంది మాత్రం సామాన్య ప్రజలు. వారే ఈ ఎన్నికల్లో వజ్రాయుధంతో తీర్పు ఇస్తారు.