చెన్నైలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో డబ్బు పోగొట్టుకుని అప్పులు అవ్వడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చెన్నై మనాలి ప్రాంతానికి చెందిన పార్థిబన్గా గుర్తించారు.పార్థిబన్కి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పార్తీబన్ బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పార్తీభన్కు మూడు నెలల క్రితమే ఆన్లైన్ గ్యాంబ్లింగ్తో పరిచయం ఏర్పడిందని అతని బంధువులు తెలిపారు. మొదట్లో గేమ్లో డబ్బులు వస్తుండంటంతో పార్థిబన్ ఆన్లైన్ జూదానికి పూర్తిగా బానిస అయ్యాడు. ఆ తరువాత ఇతరుల నుండి డబ్బు తీసుకోవడం ప్రారంభించాడు. అయితే జూదంలో ఓడిపోతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. పార్థిబన్ ఇటీవల రూ. 45,000 అప్పు తీసుకున్నాడు. అవి కూడా పోవడంతో అప్పు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై మనాలి పోలీసులు విచారణ ప్రారంభించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు న్యాయశాఖ మంత్రి రేగుపతి ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ ఆర్ఎన్ రవితో సమావేశమయ్యారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ను నిషేధించడంతోపాటు ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించేందుకు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై గవర్నర్ను వివరణ కోరగా ఈ సమావేశం జరిగింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మాదిరిగా కాకుండా ప్రత్యక్ష జూదంలో పాల్గొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల జాబితా తమ వద్ద లేదని మంత్రి తెలిపారు. ఆఫ్లైన్ జూదానికి మరియు ఆన్లైన్ జూదానికి మధ్య వ్యత్యాసం ఉందని.. ఆన్ లైన్ గేమింగ్లో డబ్బులు పొగొట్టుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని సీఎం తరపున గవర్నర్ను కోరామని మంత్రి రేగుపతి తెలిపారు. గతంలో ఆర్డినెన్స్ను ఆమోదించినప్పుడు ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు సంబంధించి 17 మంది మరణించారని, అయితే ఇప్పుడు ఆ సంఖ్య 25కి పెరిగిందని మంత్రి రేగుపతి చెప్పారు.