తమిళనాడు (TamilNadu)లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడులో పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య (Murder Of 300 Patients) చేసినట్లు ఓ వ్యక్తి చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దాదాపు 300 మందికి విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశానని చెప్పాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమక్కల్ జిల్లా పల్లిపాళయంకు చెందిన మోహనరాజ్ (34) నిత్యం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చేవాడు. మార్చురీలో పనిచేసే వ్యక్తితో కలిసి, అతను చెప్పినట్టే చేస్తాడు. ఈ నేపథ్యంలో 18వ తేదీన అతడు హత్యలపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read: Bus Collides With Truck: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
వృద్ధులు, అంగవైకల్యం ఉన్న రోగులను కుటుంబ సభ్యులు, బంధువుల కోరిక మేరకు సూదులతో విషం ఎక్కించి చంపేస్తున్నానని, ఇందుకోసం రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు పదేళ్లలో దాదాపు 300 మంది చనిపోయారని మోహన్రాజ్ తెలిపారు. ఇదే పనిపై చెన్నై, బెంగళూరు వెళ్లినట్లు కూడా ఆ వీడియోలో చెప్పాడు. రూ.5 వేలు ఇస్తే రెండు నిమిషాల్లో పనులు పూర్తి చేస్తానని పేర్కొన్నాడు. వీడియో వైరల్ కావడంతో పల్లిపాలెం పోలీసులు కేసు నమోదు చేసి మోహనరాజ్ను అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో అలా చెప్పినట్లు విచారణలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.